రైతేడ్చిన రాజ్యం బాగుండదు
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అరిగోస
రాష్ట్రంలో దుష్ట పాలన కొనసాగుతోంది
మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజం
రేవంతు.. రైతుబంధు ఏమైంది? : ఎర్రబెల్లి దయాకర్ రావు
మొక్కజొన్న కొనుగోళ్లు లేక కర్షకుల ఆవేదన : మాజీ మంత్రి రెడ్యా
6న పాలకుల నిద్ర మత్తు వదిలిస్తాం: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : “ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అలాగే ఉంది” అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. సాగునీరు, విద్యుత్, యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సమరశంఖం పూరించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత దుష్టమైన పాలన సాగిస్తోందని మధుసూదనాచారి మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో భూగర్భ జలాలు పెరిగి సాగునీరు పుష్కలంగా అందేదని, ఇప్పుడు మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, రైతులు గత పాలనను, ఇప్పటి పరిస్థితులను పోల్చి చూడాలని కోరారు.
మొక్కజొన్న రైతుల కడుపు కొడుతున్నారు : రెడ్యా నాయక్
మహబూబాబాద్ మార్కెట్లో దాదాపు 2 లక్షల బస్తాల మొక్కజొన్న పేరుకుపోయినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి రెడ్యా నాయక్ ఆరోపించారు. మద్దతు ధర కంటే వెయ్యి రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు కుదేలవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ అమలులో డొల్లతనాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్లో భారీ ‘రైతు సదస్సు’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్-చార్జ్ మంత్రి కేవలం కాంట్రాక్టుల రివ్యూలకే పరిమితమయ్యారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు.
రైతుబంధు ఏమైంది?: ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం.. నేడు కాంగ్రెస్ రాకతో భారంగా మారిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రైతుబంధు నిధులు సకాలంలో అందక, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే అన్నదాతలను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నర్సింహులపేట వంటి ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించకుండా మంత్రులు ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.

