సొంతింటి కలను నెరవేరుస్తాం
పేదల సంక్షేమమే ఈ ప్రభుత్వం లక్ష్యం
త్రినగరిలో రూ.5300 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్
త్వరలో మామునూర్ విమానాశ్రయానికి శంకుస్థాపన
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
న్యూ శాయంపేటలో 2బీహెచ్కే గృహ సముదాయం ప్రారంభం
లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి
పారదర్శకంగా గృహాల కేటాయింపు : కలెక్టర్ చాహత్ బాజ్పాయి
కాకతీయ, వరంగల్ బ్యూరో : పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్కే గృహాల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అంతకుముందు ఖాజీపేట మండలం న్యూ శాయంపేటలో నూతనంగా నిర్మించిన 2బీహెచ్కే గృహ సముదాయాన్ని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. గృహప్రవేశ కానుకలు అందించి, ప్రాంగణంలో మొక్క నాటారు.
మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి రూ.22500 కోట్ల వ్యయంతో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున కేటాయింపులు చేసినట్లు చెప్పారు. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ గృహాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో 1.80 లక్షల గృహాల నిర్మాణం పూర్తై లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించుకున్నారని వెల్లడించారు.
అసంపూర్తి 2బీహెచ్కే ఇళ్లకు పూర్తి స్థాయి సాకారం
గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన 2బీహెచ్కే గృహాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలకు ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి, భద్రతకు, కుటుంబ భవిష్యత్తుకు ప్రతీక అని అన్నారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో వేలాది పేద కుటుంబాలు గృహాల కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొన్న మంత్రి, హైదరాబాద్లో అమలు చేస్తున్న నమూనాలోనే వరంగల్లో కూడా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రానున్న రెండున్నరేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా గృహాలు అందించడమే లక్ష్యమన్నారు.
రూ.5300 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్
వరంగల్ నగరాన్ని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సుమారు రూ.5300 కోట్ల వ్యయంతో ఆధునిక అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే వరదలు, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మామునూర్ విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణ పూర్తైందని, త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విమానాశ్రయం అభివృద్ధితో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ధృవీకరణ అనంతరం అర్హులైన వారినే ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ గృహాన్ని ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన పేద కుటుంబాలకు పారదర్శకంగా గృహాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఇళ్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గృహాలు పొందిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి. అజీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేష్, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈ రవీందర్, అదనపు కమిషనర్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు.

