- మెదడు స్పందనపై వైద్యుల ఆందోళన
- 72 గంటల తర్వాత మరోసారి న్యూరోలాజికల్ అంచనా
- యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల

కాకతీయ,తెలంగాణ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, గుండె, శ్వాస సంబంధిత పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నప్పటికీ మెదడు స్పందన ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. హెల్త్ బులెటిన్ ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత వరంగల్లోని రోహిణి ఆస్పత్రికి తీవ్ర పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) సమస్యను ఎదుర్కొన్నారు. గుండె ఆగిపోవడంతో సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఏసీఎల్ఎస్) చికిత్స నిర్వహించిన అనంతరం గుండె స్పందన పునరుద్ధరించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వరంగల్లో థ్రాంబోలిసిస్ చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ క్రిటికల్ కేర్, పల్మనరీ, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులతో కూడిన బృందం చికిత్స అందిస్తోంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తూ అవసరమైన మందులు, ఇతర చికిత్సలు కొనసాగిస్తున్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు. అయితే గుండె ఆగిన సమయంలో సుదీర్ఘంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్లు (అనాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్) ఈఈజీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షల్లో సంకేతాలు కనిపించినట్లు వైద్యులు వెల్లడించారు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు గానీ, నొప్పికి గానీ అర్థవంతమైన న్యూరోలాజికల్ స్పందన కనిపించలేదని తెలిపారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల తర్వాత మరోసారి న్యూరోలాజికల్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిపై తుది అంచనా వేస్తామని యశోద ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. రోగి ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్లో వెల్లడించింది.

