జంగా అంటే.. వ్యక్తి కాదు..వ్యవస్థ
ఐదు నియోజకవర్గాల్లో నాకు స్పష్టమైన ఓటు బ్యాంకు!
విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పోరాటం
నిర్బంధాల నుంచే నా నాయకత్వ ప్రస్థానం
ఇప్పుడంతా పవర్ అండ్ మనీ పాలిటిక్స్..
డీసీసీబీ, ఆయిల్ఫెడ్ బాధ్యతల్లో రైతుల సంక్షేమమే నా లక్ష్యం
గ్రేటర్ వరంగల్ మేయర్ రేసులో ఉన్నా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటా
ఎలాంటి పరిణామాలకైనా సిద్ధపడే ఉన్నా
అవసరమనుకుంటే నా చిన్న కూతురు నిఖితారెడ్డి రాజకీయాల్లోకి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తాజా మాజీ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పనిచేశా. ప్రజా ఉద్యమాల్లో ఉన్నా. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ఎదిగినవాడిని. నిర్బంధాలు ఎదురైతే పారిపోయే వ్యక్తిని కాదు. పదవులు ఉన్నా లేకపోయినా, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటున్నా. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నా. ఒక మాట మాత్రం చెబుతున్నా.. జంగా అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేకంగా పనిచేసే సైన్యం ఉంది. అక్కడి ప్రజలతో, కార్యకర్తలతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కీలకంగా ఉంటుంది. పదవుల కోసం నా రాజకీయ ప్రస్థానం మొదలుకాలేదు. ప్రజల కోసం పనిచేయడం నుంచే నా ప్రయాణం మొదలైంది. ఎన్నో కష్టాలు, నిర్బంధాలు, ఒడిదుడుకులు దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చా. ఇక ముందూ ఎలాంటి పరిణామాలు ఎదురైనా సిద్ధంగానే ఉంటానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆయిల్ ఫెండ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..!

ప్రశ్నించడమే నా రాజకీయానికి పునాది
మొదటి నుంచీ మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబమే. మా నాన్న సర్పంచ్గా పనిచేశారు. అయితే నేను మాత్రం పాఠశాల దశ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల కోసం పనిచేయడం అప్పుడే ప్రారంభించా. ప్రజా ఉద్యమాల్లో కలిసిపోయి పనిచేస్తున్న సమయంలో అప్పటి ప్రభుత్వాల నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నా. పోలీసుల నుంచి తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. కానీ ఆ కష్టాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు. పైగా అవే నాలో పోరాట స్ఫూర్తిని పెంచాయి. నన్ను ఒక శక్తిగా తీర్చిదిద్దాయి. నా విద్యార్థి దశలో రాజకీయ గురువు సుధాకర్గాంధీ. ఆయన వల్లే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేర్చుకున్నా. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రజల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారు. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా. నిర్బంధాలు ఎదురైనా, కష్టాలు వచ్చినా, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రజల మధ్యే ఉన్నా. పారిపోయే రాజకీయాలు నాకు తెలియవు. ప్రజల కోసం పోరాడినప్పుడే నాయకుడిగా గుర్తింపు వస్తుందని నమ్ముతా.

రెండుసార్లు ఏకగ్రీవంగా.. ఆ తర్వాత డీసీసీబీ
కాంట్రాక్టర్గా, వ్యాపారవేత్తగా పనిచేస్తూనే రాజకీయాల్లోకి వచ్చా. సీరియస్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాజీపేట దర్గా పీఏసీఎస్ చైర్మన్గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా పనిచేశా. రైతులతో నేరుగా అనుసంధానమై ఉండే బాధ్యత కావడంతో దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చా. జిల్లా రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టా. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం లక్ష్యంగా పనిచేశా. డీసీసీబీని మరింత బలోపేతం చేయడానికి కూడా కృషి చేశా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీడ్స్ అండ్ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ బాధ్యతను కూడా రైతుల కోసమే ఉపయోగించుకున్నా. ముఖ్యంగా ఆయిల్పామ్ సాగు విస్తరణ కోసం అహర్నిశలు పనిచేశా. తెలంగాణవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు పెరగడానికి కృషి చేశా. రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉండే పంటగా ఆయిల్పామ్ను ప్రోత్సహించా. రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే నా ఆలోచన. నేను ఏ పదవిలో ఉన్నా రైతుకు ఉపయోగపడే పని చేయాలన్నదే నా ప్రయత్నం.

జంగా బలం.. ఐదు నియోజకవర్గాల్లో
జంగా అంటే ఒక వ్యక్తి మాత్రమేనని ఎవరూ అనుకోవద్దు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నాకు ప్రత్యేకంగా పనిచేసే సైన్యం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలతో ఉన్న అనుబంధం, కార్యకర్తలతో ఉన్న సంబంధం నాకు ఈ బలాన్ని ఇచ్చాయి. నేను పదవిలో ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గాల్లో తిరిగిన వ్యక్తిని కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటున్నా. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటున్నా. అందుకే అనేక నియోజకవర్గాల్లో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా. నా రాజకీయ బలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైనది కాదు. కార్యకర్తలతో నాకు ఉన్న అనుబంధం, ప్రజలతో ఉన్న సంబంధమే నా బలం.
మేయర్ రేసులో ఉన్నా
అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పార్టీపై నాకు చాలా నమ్మకం ఉంది. గ్రేటర్ వరంగల్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్గా రేసులో ఉన్నా. నా చిన్న కూతురు డాక్టర్ నిఖితారెడ్డి కూడా అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చి బరిలో ఉంటుంది. గ్రేటర్ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా కృషి చేస్తున్నా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నా. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీరియస్గా పనిచేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్లడం కాదు.. నిత్యం ప్రజల మధ్య ఉండటమే నా రాజకీయ విధానం.
డీలిమిటేషన్ ఎలా ఉన్నా.. అసెంబ్లీ బరిలో పక్కా
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. తెలంగాణలోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపురేఖలు కూడా మారవచ్చు. డీలిమిటేషన్ అంశాన్ని నేను ఆసక్తిగా గమనిస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందో చూడాలి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నేను కచ్చితంగా బరిలో ఉంటా. ఎక్కడి నుంచి అనేది డీలిమిటేషన్ తర్వాత నిర్ణయించుకుంటా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా నా పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారన్న నమ్మకం ఉంది. అనేక ఎన్నికల్లో పార్టీ పెద్దలు, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. ఎక్కడా ధిక్కరించలేదు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడిగా రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయా. అయినా పార్టీ కోసం పనిచేయడం ఆపలేదు. పదవులు నాకు ముఖ్యం కాదు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యం. ఇన్నేళ్లుగా పార్టీకి చేసిన సేవకు వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించి పనిచేస్తా.
రాజకీయాల్లో విలువలు పోయాయి..
రాజకీయాలతో పాటు పాత్రికేయ రంగం కూడా కొంత కలుషితమైందన్న బాధ నాకు ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు అధికారం, డబ్బు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజా ప్రయోజనాలు వెనక్కి వెళ్లి వ్యక్తిగత ప్రయోజనాలే ముందుకు వస్తున్నాయి. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉండాలి. కానీ వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైతే ప్రజలకు నష్టం జరుగుతుంది. పాత్రికేయ రంగంలోనూ కొన్ని మార్పులు వస్తున్నాయి. అయినా పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులను రాయడంతోపాటు తప్పులు జరిగితే ప్రశ్నించాలి. ప్రజల కోసం రాయాలి. ప్రజల గొంతుకగా నిలబడాలి. పత్రికలు, జర్నలిస్టులు ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటేనే ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ప్రజా ప్రయోజనాలను కాపాడే బాధ్యతలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. నేను ఇప్పటివరకు ఎన్ని పదవులు వచ్చినా వాటిని ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా పనిచేశా. ఇక ముందూ అదే విధంగా పనిచేస్తా. గెలుపు, ఓటమి రాజకీయ జీవితంలో సహజం. కానీ ప్రజల మధ్య ఉండటం, పార్టీ కోసం నిలబడటం మాత్రం నా చేతిలో ఉంది. అందుకే ఎలాంటి పరిణామాలు ఎదురైనా సిద్ధంగానే ఉన్నా.
ఉత్తరం కాకతీయ ఎడిటర్
అరెల్లి కిరణ్ గౌడ్
-7396604266

