మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!
మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం
వైఎస్సార్ ఇచ్చిన మాట తప్పలేదు.. ఆయనే నా అన్న
2005లో వరంగల్ తొలి మేయర్గా అవకాశం
మేయర్గా రూ.178 కోట్ల నిధులతో నగరంలో చారిత్రాత్మక అభివృద్ధి
పదవులు ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ను వీడలేదు
కష్టకాలంలో అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా.. వద్దనుకున్నాం
సీఎం రేవంత్రెడ్డి నా పనితీరును గుర్తించారు
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నన్ను ప్రోత్సహిస్తున్నారు
రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు.. పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
‘‘రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మా వారి రాజకీయ జీవితం.. మా మామ ప్రోత్సాహం నన్ను అనుకోకుండా రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. 1991లో పీఏసీఎస్ చైర్మన్గా పోటీ చేసినప్పటి నుంచి గెలుపోటములు, పదవులు, అవమానాలు, ప్రలోభాలు ఎన్నో చూశాం. కష్టకాలంలో ఇతర పార్టీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ను వీడలేదు. వైఎస్సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నన్ను మేయర్ను చేశారు. ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా నా పనితీరును గుర్తించి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారు. పదవులు అడిగి తీసుకోవడం నా పద్ధతి కాదు.. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా వంద శాతం పనిచేయడమే తెలుసు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తా’’ అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో ఆమె తన బాల్యం, వివాహం, అత్తింటి అనుబంధం, భర్త వరద రాజేశ్వర్రావుతో కలిసి సాగించిన రాజకీయ ప్రస్థానం, 1991లో రాజకీయ అరంగేట్రం, ఎమ్మెల్యే ఎన్నికలో ఓటమి, 2005లో మేయర్గా అవకాశం, నగరాభివృద్ధి, కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం, వైఎస్సార్, రేవంత్రెడ్డితో తనకున్న అనుబంధం, మహిళా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను తన మాటల్లోనే పంచుకున్నారు.

19 ఏళ్లకే పెళ్లి.. రాజకీయ కుటుంబంలో అడుగు
‘‘మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పాతగూడూరు. మా నాన్న హన్మంతరావు లాయర్గా ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత కాంట్రాక్టర్గా పనిచేశారు. మాకు అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఇంటర్ వరకు కరీంనగర్ నగరంలోనే చదువుకున్నా. ఇంటర్లో ఉండగానే 19 ఏళ్లకే పెళ్లి కావడంతో చదువు కొనసాగించలేకపోయా. అక్క భర్తకు స్నేహితుడైన వరద రాజేశ్వర్రావుతో పరిచయం ద్వారా నా పెళ్లి సంబంధం వచ్చింది. ఆయన అప్పట్లో ఉద్యోగం చేయకపోవడంతో మా ఇంట్లో కొంత సందేహం వచ్చింది. కానీ ఆయన మంచివారని చెప్పి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నాకు ఆయన నచ్చారు.. ఆయనకు కూడా నేను నచ్చడంతో పెళ్లి జరిగింది. అప్పట్లో ఆడవాళ్లం గడీల నుంచి బయటకు వచ్చేవాళ్లం కాదు. రాజకీయాలు, పదవులు అనేవి మా జీవితంలో ఉంటాయని ఊహించలేదు. కానీ పెళ్లి తర్వాత అత్తింట్లో నాకు చాలా గౌరవం లభించింది. మా మామ కులశేఖర్రావు, అత్త లక్ష్మీదేవి నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నారు. మా మామే నన్ను రాజకీయంగా ప్రోత్సహించారు. మా వారి రాజకీయ ప్రయాణాన్ని దగ్గరగా చూస్తూ నేర్చుకున్నా. అదే తర్వాత నా జీవితానికి కొత్త దారిని చూపించింది.’’

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు
‘‘మా వారు వరద రాజేశ్వర్రావు 1985 నుంచే వర్ధన్నపేట రాజకీయాల్లో ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. సంజయ్గాంధీ వచ్చినప్పుడు ఆయన కోసం అండాల కొద్దీ పులిహోర తయారు చేసి రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి ఇచ్చిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. రాజకీయాల్లో ప్రజలతో ఎలా ఉండాలి? కార్యకర్తలను ఎలా చూసుకోవాలి? ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి? అనే విషయాలను ఆయన నుంచే నేర్చుకున్నా. మా మామ కులశేఖర్రావు మాత్రం నన్ను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1991లో వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ ఎన్నికలు వచ్చినప్పుడు నన్ను పోటీ చేయమన్నారు. పిల్లలు చిన్నవాళ్లు.. నేను రాజకీయాల్లోకి ఎలా వస్తానని మొదట వెనుకాడా. కానీ మామ, మా వారు పట్టుబట్టారు. చివరకు పోటీ చేశా. పెద్దగా ప్రచారం చేయలేదు. ఒక్కరోజు మాత్రమే ప్రచారం చేసినా గెలిచా. అలా 1991లో నా రాజకీయ అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత ఓడీసీఎంఎస్ డైరెక్టర్గా కూడా పోటీ చేశా. అందులోనూ గెలిచా. అయితే చైర్మన్ పదవి విషయంలో సొంత పార్టీలోనే నాకు అనుకూల పరిస్థితి లేకపోవడంతో ఆ అవకాశం దక్కలేదు. బీరం సంజీవరెడ్డి చైర్మన్గా అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే గెలుపుతో పాటు ఇలాంటి అనుభవాలూ ఎదురయ్యాయి.’’
వర్ధన్నపేటతో నాలుగు దశాబ్దాల అనుబంధం
‘‘1985లో మా వారికి గాంధీభవన్ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లు ఫోన్ వచ్చింది. అప్పటికి నాకు రాజకీయాల్లో టికెట్ అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియదు. మాధవరావు మనుమడు అన్న గుర్తింపు తప్ప రాజేశ్వర్రావుకు పెద్దగా రాజకీయ పరిచయం లేదు. అయినా పోటీ చేశారు. సుమారు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఉదయం 7 గంటలకే గ్రామాల్లోకి వెళ్లేవారు. ప్రతి ఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునేవారు. అలా ప్రజలతో బంధం పెంచుకున్నారు. తర్వాత మళ్లీ టికెట్ వచ్చినా ఎన్నికలకు ముందు రోజు అభ్యర్థిని మార్చిన సందర్భం ఉంది. మా వారు బీ-ఫాంతో నామినేషన్ వేయడంతో చేయి గుర్తు కూడా వచ్చింది. పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులు ఉండటంతో సుమారు ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా వర్ధన్నపేట ప్రజలతో ఉన్న సంబంధాన్ని మాత్రం వదులుకోలేదు. మా కుటుంబానికి అక్కడ ఇప్పటికీ కార్యకర్తలతో, ప్రజలతో అనుబంధం ఉంది.’’
కష్టకాలంలోనూ కాంగ్రెస్నే నమ్ముకున్నాం
‘‘మా కుటుంబానికి కాంగ్రెస్తో ఉన్న అనుబంధం చాలా పాతది. రాజకీయంగా అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. కానీ పార్టీ విషయంలో మాత్రం మేం ఎప్పుడూ కాంగ్రెస్ను వీడలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్లోనే ఉన్నాం. కష్టకాలంలో అనేక రాజకీయ ఆఫర్లు వచ్చాయి. కేసీఆర్ కూడా మమ్మల్ని పిలిచారు. అయినా వెళ్లలేదు. పదవులు ఉన్నప్పుడు పార్టీతో ఉండటం ఒక విషయం. పదవులు లేకపోయినా పార్టీతోనే ఉండటం మరో విషయం. మేం రెండో దారినే ఎంచుకున్నాం. జీవితమంతా కాంగ్రెస్తోనే మా ప్రయాణం. పదవి కోసం పార్టీ మారడం మా కుటుంబానికి అలవాటు లేదు.’’
వైఎస్సార్ పిలిచి.. ‘‘టికెట్ ఇస్తా’’ అన్నారు
‘‘మేం పదవుల్లో ఉన్నామా? లేదా? అన్నది చూడకుండా కాంగ్రెస్లోనే పనిచేస్తున్న తీరును వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తించారు. 2004లో అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సమయంలో వర్ధన్నపేటలో ఐదు నియోజకవర్గాల సమీక్ష ఏర్పాటు చేయాలని మా వారికి ఫోన్ చేశారు. అప్పుడు డీసీసీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్రెడ్డి, మా వారు రాజేశ్వర్రావు వైఎస్సార్తో కలిసి ఉన్నారు. అప్పుడు నన్ను పిలిచి ‘వచ్చే ఎన్నికల్లో నువ్వే పోటీ చేయాలి.. టికెట్ ఇస్తా’ అని చెప్పారు. ఒకవేళ ఓడిపోయినా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఆ మాట నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. అప్పటికే నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. అయినా పోటీ చేశా. తీగరాజుపల్లిలో వైఎస్సార్తో భారీ బహిరంగ సభ నిర్వహించాం. ఇసుక పోస్తే రాలనంతగా జనం వచ్చారు. ఆ సభను విఫలం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నా కుమారులను కూడా కొట్టారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రత్యర్థి వర్గం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసి మా వాళ్లను ప్రలోభపెట్టిందని నేను భావించా. దగ్గరి వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. చివరకు నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయా. అయినా మా కేడర్ బలమే నన్ను అంత దగ్గర వరకు తీసుకెళ్లింది.’’
నేను ఓడినా.. వైఎస్సార్ మాట తప్పలేదు
‘‘ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్సార్ నాకు ఇచ్చిన మాటను మర్చిపోలేదు. 2005లో వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నేను కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచా. మేయర్ పదవికి అప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. పలువురు నేతలు తమ కుటుంబాల నుంచి మేయర్ను చేయాలని ప్రయత్నించారు. నేను మాత్రం మేయర్ పదవి కావాలని ఎక్కడా అడగలేదు. మా వారితో కలిసి వైఎస్సార్ను కలిశాం. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బలమైన పోటీదారులు ఉన్నా నన్ను మేయర్గా చేశారు. అలా 2005లో వరంగల్ మున్సిపాలిటీ తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టా. అది నా రాజకీయ జీవితంలో ఎంతో కీలకమైన మలుపు. వైఎస్సార్ నాకు రాజకీయ నాయకుడే కాదు.. అన్న లాంటి వారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆయనను నా అన్నగా భావిస్తా.’’
రూ.178 కోట్లతో నగరాభివృద్ధి
‘‘మేయర్గా ఉన్న సమయంలో నగర అభివృద్ధికి ప్రత్యేకంగా పనిచేశా. ఎవరూ ఊహించని స్థాయిలో రూ.178 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశాం. ప్రధాన జంక్షన్ల విస్తరణ, అభివృద్ధి, తాగునీటి సరఫరా, స్లమ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాం. అప్పటి కేంద్ర మంత్రి దివంగత జయపాల్రెడ్డి ఎంతో సహకరించారు. ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాం. మహిళలను లక్షాధికారులుగా చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టాం. మేయర్గా నగరానికి చేయగలిగినంత చేశానన్న సంతృప్తి నాకుంది.’’
మా అంకితాభావాన్ని రేవంత్రెడ్డి గుర్తించారు
‘‘రేవంత్రెడ్డి పాదయాత్ర సమయంలో వరంగల్కు వచ్చినప్పుడు మా కుటుంబాన్ని కలిశారు. మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబమని చెప్పారు. కాంగ్రెస్కు ఆ ఎన్నికలు చివరి అవకాశమని, పార్టీని గెలిపించడానికి పనిచేయాలని కోరారు. ఆయన మాట మేరకు పనిచేశాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను ఎలాంటి పదవీ అడగలేదు. నా పనితీరును ఆయనే గుర్తించారు. 2023లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రకటన వచ్చినప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. పదవులు అడిగి తీసుకోవడం నాకు అలవాటు లేదు. పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుందనే నమ్మకం నాది. సీఎం రేవంత్రెడ్డి నా పనితీరును గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది.’’
20 జిల్లాల్లో మహిళా కాంగ్రెస్ బలోపేతం
‘‘రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు 20 జిల్లాల్లో పర్యటించా. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నా. మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాం. మహిళలు కేవలం పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే వారిగా కాకుండా.. ఎన్నికల వ్యూహాల్లో కీలక భాగస్వాములుగా ఉండాలి. రానున్న ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలి. మహిళా కాంగ్రెస్ను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలి. హైదరాబాద్ మేయర్ పదవిని కాంగ్రెస్ గెలుచుకోవాలని కోరుకుంటున్నా. జీహెచ్ఎంసీతో పాటు జీడబ్ల్యూఎంసీలోనూ పార్టీ బలోపేతం కావాలి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్కు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించడమే నా లక్ష్యం.’’
రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు
‘‘రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. నాకు ఓపిక ఉన్నంతకాలం కాంగ్రెస్ కోసం పనిచేస్తా. సుమారు ఐదు దశాబ్దాలుగా మా కుటుంబం పార్టీతో కలిసి నడుస్తోంది. పదవులు వచ్చినా.. పోయినా మా ప్రయాణం ఆగలేదు. కష్టకాలంలో కూడా పార్టీని వీడలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడుగుతున్నారు. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తా. పదవి కోసం నేను ఎప్పుడూ పరుగులు పెట్టలేదు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని చెప్పినా వంద శాతం కష్టపడి పనిచేస్తా. నన్ను నమ్మి ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యం. మా వారి నుంచి నేర్చుకున్న రాజకీయ ఓనమాలు.. మామ ఇచ్చిన ప్రోత్సాహం.. వైఎస్సార్ ఇచ్చిన మాట.. ఇప్పుడు రేవంత్రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహం.. ఇవన్నీ నా రాజకీయ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయాలు’’ అని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.
కాకతీయ,తెలంగాణ బ్యూరో/
కిరణ్ గౌడ్ అరెల్లి
-7396604266

