పోరాటమే నా బలం
నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది
దాట్లలో మా మూలాలు.. హన్మకొండలో నా బాల్యం
జెండా దగ్గరే మొదటి పోరాటం.. కాలేజీలో తొలి కేసు
కిన్నెర మా అడ్డా.. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఎదిగాను
యూత్ కాంగ్రెస్తో రాజకీయ మలుపు.. టికెట్ కోసం సుదీర్ఘ పోరాటం
రేవంత్రెడ్డితో మళ్లీ పోరాటం.. కేసులైనా కండువా మార్చలేదు
రాహుల్ నుంచి నేరుగా ఫోన్.. రాజకీయాల్లో అది మరిచిపోలేని గౌరవం
వరంగల్ బ్రాండ్ పెంచడమే లక్ష్యం..
నన్ను తొక్కాలని సొంత పార్టీలోనూ చూశారు. పార్టీ మారితే కేసులు మాఫీ చేస్తామన్నారు. అయినా కాంగ్రెస్ కండువా తప్ప మరో కండువా నా మెడలో ఉండదని తేల్చిచెప్పా’’ అని ఆయన తన రాజకీయ ప్రయాణంలోని కీలక ఘట్టాలను గుర్తుచేసుకున్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సెయింట్ జాన్స్ స్కూల్లో మొదలైన అల్లరి.. జెండా దగ్గర జరిగిన తొలి పోరాటంతో వచ్చిన గుర్తింపు.. చదువు అబ్బక బర్లు కాయడానికి పంపిస్తానన్న తండ్రి హెచ్చరిక.. ఇంటర్లోనే పోలీస్ కేసు.. కిన్నెర హోటల్ వద్ద సాగిన విద్యార్థి రాజకీయాలు.. డిగ్రీలో ఎన్ఎస్యూఐ అధ్యక్ష పదవి.. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైన రాజకీయ మలుపులు.. టికెట్ కోసం సాగిన సుదీర్ఘ నిరీక్షణ.. చివరకు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రయాణం. మధ్యలో 54 కేసులు, మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నాలు, పార్టీ మారితే కేసులు మాఫీ చేస్తామన్న ప్రలోభాలు.. అయినా కండువా మార్చని పట్టుదల. రాహుల్గాంధీ నుంచి నేరుగా వచ్చిన ఫోన్ నుంచి రేవంత్రెడ్డితో టికెట్ కోసం చేసిన పోరాటం వరకు నా జీవితంలో ఎన్నో మలుపులు. దాట్లలో మొదలైన కుటుంబ కథ నుంచి వరంగల్ బ్రాండ్ను పెంచాలన్న లక్ష్యం వరకు.. నా జీవితంలో ప్రతి మలుపూ ఓ పోరాటమే. కాలం మారింది.. రాజకీయాలు మారాయి.. అప్పటి రాజకీయ సంస్కారం మాత్రం తిరిగి రావడం లేదన్నదే నా బాధ అంటూ నాయిని రాజేందర్ రెడ్డి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. . విద్యార్థి దశలో మొదలైన పోరాట స్వభావమే తన రాజకీయ జీవితానికి పునాదిగా మారిందని, చివరకు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవాలన్న తన కలను సాకారం చేసుకున్నానని వెల్లడించారు. శనివారం డిజిటల్ మీడియా ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చిట్చాట్లో అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..!

దాట్ల నుంచి హన్మకొండకు..
మా అమ్మానాన్న జయమాల, నరేందర్రెడ్డి తొర్రూరు మండలం దాట్లలో ఉండేవారు. ఇప్పటికీ అక్కడ మా కుటుంబానికి భూములున్నాయి. నాన్నకు పెళ్లైన కొద్దిరోజుల తర్వాతనే హన్మకొండకు షిప్ట్ అయ్యారు. నేను మిషన్ ఆస్పత్రిలో పుట్టాను. నాకు తమ్ముడు ఉన్నాడు. మా కుటుంబంలో ఇంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరు. నేను రాజకీయాల్లోకి రావడం పూర్తిగా నా ప్రయాణమే. చిన్నప్పటి నుంచే నేను కొంచెం రఫ్గా, హైస్పీడ్గా ఉండేవాడిని. జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం నన్ను ఒక్కో మెట్టు ఎక్కించింది.
సెయింట్ జాన్స్ స్కూల్లో నా చదువు మొదలైంది. ఆ తర్వాత నాన్న నన్ను గౌతమ్ ప్రాక్టిసింగ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్పించారు. ఏడో, ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక ఆగస్టు 15న మా స్కూల్లో జెండా వందనానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి త్రివర్ణ పతాకం వద్దని, బ్లాక్ జెండా పెడతామని అన్నారు. ప్రిన్సిపాల్ అంగీకరించకపోవడంతో చిన్నపాటి పెనుగులాట జరిగింది. ప్రిన్సిపాల్ కిందపడటంతో నేను వెంటనే వారితో ఫైటింగ్కు వెళ్లాను. ఆ ఘటన తర్వాత స్కూల్లో నా క్రేజ్ పెరిగింది. సార్లు నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే నాకు భలే అనిపించేది. అయితే చదువు మాత్రం నాకు ఎప్పుడూ అబ్బలేదు. స్కూల్ బంద్ కొట్టి సినిమాలకు వెళ్లేవాడిని. సత్యనారాయణ అనే మంచి టీచర్ ఉండేవారు. మేము థియేటర్కు వెళ్లామని తెలిసి అక్కడికే వచ్చి క్లాస్రూమ్కు తీసుకొచ్చేవారు.

కాలేజీలో పోరాటాలు..
చదువంటే నాకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది కాదు. బలవంతంగా చదివినా కష్టంగా పాస్ అయ్యేవాడిని. ఒకసారి పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయి. నాన్న మా అమ్మ ముందు నన్ను తిడుతూ, వీడు చదవడు.. బర్లు కాయడానికి పంపిస్తా అన్నాడు. నాన్న నిజంగానే పంపిస్తాడేమో అనుకుని నేను కూడా అక్కడ పతంగులు ఎగురేసుకోవచ్చని సిద్ధమయ్యా. అది చూసిన కొంత షాక్కు గురైన నాన్న మళ్లీ నన్ను తిట్టాడు. డిగ్రీలోనూ లెక్చరర్లు ఎంత కష్టపడినా నేను పాస్ కాలేకపోయాను. పుస్తకం అంటేనే పడకపోయేది. కానీ కాలేజీకి వచ్చేసరికి నా దృష్టి పూర్తిగా మరో వైపు మళ్లింది. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు నా స్నేహితులు సీకేఎం కాలేజీలో ఎన్ఎస్యూఐ తరఫున బ్యానర్లు కట్టేందుకు వెళ్లారు. వారిపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి బురదలో పడేసి కొట్టారు. మరుసటి రోజు నేను 18 మందితో అక్కడికి వెళ్లాను. అక్కడ 100 మందికిపైగా ఉన్నారు. వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఘర్షణ జరిగింది. కేసులు నమోదయ్యాయి. అది నా జీవితంలో మొదటి కేసు. అప్పట్లో బస్వరాజు సారయ్య పోలీస్స్టేషన్లో మాట్లాడి మమ్మల్ని కొట్టకుండా కాపాడారు.
కిన్నెర హోటల్ నుంచి ఎన్ఎస్యూఐ అధ్యక్షుడి వరకు
పబ్లిక్ గార్డెన్ సమీపంలోని కిన్నెర హోటల్ మా అడ్డా. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డాలు అక్కడే ఉండేవి. కోహినూర్ హోటల్ వద్ద మరో సంఘం ఉండేది. దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పట్లో హన్మకొండలో ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ కార్యాలయాలు పక్కపక్కనే ఉండేవి. కార్యాలయాల్లో బియ్యం బస్తాలు తెచ్చి పెట్టుకునే పరిస్థితి. రాత్రివేళ రామకృష్ణ పరమహంస అనే డీఎస్పీ నలుగురు పోలీసులను సెక్యూరిటీగా పంపేవారు. యుద్ధ వాతావరణంలా ఉండేది. అప్పుడు 12వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎర్ర ప్రకాశ్రెడ్డి, మరో పార్టీ నుంచి రావు అమరేందర్రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ ఫైటింగ్ జరిగింది. అదే సమయంలో నాపై తొలిసారి రాజకీయ కేసు నమోదైంది. ఆ కేసునూ బస్వరాజు సారయ్యే డీల్ చేశారు. 1988లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరాను. మూడు నెలలకే నాపై దాడి జరిగింది. వడ్డెపల్లి ప్రాంతానికి చెందినవారంటే అప్పట్లో భయం ఉండేది. నేను మాత్రం నా టీమ్ను నడుపుకునేవాడిని. నాపై దాడి చేస్తే రివెంజ్ తీసుకుంటానని వారికి తెలుసు. రెండు మూడు రోజులు ఓపిక పట్టి, గ్రౌండ్లో దొరికినవారిని దొరికినట్టుగా హాకీ స్టిక్స్తో కొట్టాం. ఆ తర్వాత డిగ్రీ ఫస్టియర్లోనే నాకు ఎన్ఎస్యూఐ కాలేజీ అధ్యక్ష పదవి ఇచ్చారు. విద్యార్థుల సమస్యలపై నిలదీసేవాడిని. నన్ను కాలేజీ నుంచి బయటకు పంపించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవే నా రాజకీయ మలుపు
నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి. పీవీ రంగారావు నన్ను ప్రోత్సహించారు. దేవేందర్రెడ్డితో పోటీ ఉన్నప్పటికీ ఆయన వర్గాన్ని కాదని నాకు అవకాశం ఇచ్చారు. విజయవాడలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సమరభేరి సభ పెట్టినప్పుడు నేను 102 వాహనాలు ఏర్పాటు చేశాను. అందులో 100 సుమోలు, రెండు బస్సులు ఉన్నాయి. వాటికి నా ఫొటోలతో పోస్టర్లు పెట్టించాం. గోల్డ్స్మిత్ వృత్తిలో ఉన్న స్నేహితుడు ఒకడు విజయవాడలో ఉండేవాడు. అతనికి ఫోన్ చేసి భోజనాలు, నీళ్ల ప్యాకెట్లు, నాలుగు బ్యానర్లు ఏర్పాటు చేయమన్నాను. కానీ నేను చెప్పినదానికంటే రెట్టింపు ఏర్పాట్లు చేశాడు. జంబో పూలదండ, పెద్ద పెద్ద కటౌట్లు కూడా పెట్టించాడు. రమేశ్బాబు, వినోద్కుమార్, అజీజ్ఖాన్ నాతో వచ్చారు. నా దోస్తు ఎంత బిల్లు పంపిస్తాడోనని భయపడ్డా. చివరకు ఏ బిల్లూ పంపలేదు.
‘పని చేసే అధ్యక్షుడు’గా ఎనిమిదేళ్లు
ఆ తర్వాత కాంగ్రెస్ వరంగల్ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను, పుల్లా భాస్కర్ను అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి జిల్లా ఇన్చార్జి నన్ను సరదాగా పని చేసే అధ్యక్షుడు అని పిలిచేవారు. హయగ్రీవాచారి, తోకల దేవేందర్రెడ్డి నా రాజకీయ గురువులు. వారి నీడలోనే రాజకీయంగా ఎదిగాను. సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేశాను. 2005లో లైబ్రరీ చైర్మన్గా ఉన్నాను. 2014లో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డీసీసీగా పనిచేశాను. కాకతీయ ఆటో యూనియన్, మెడికల్ అండ్ హెల్త్ తదితర సుమారు 20 సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. అసెంబ్లీ టికెట్ కోసం 2004 నుంచే ప్రయత్నించాను. 2004లో టీఆర్ఎస్–కాంగ్రెస్ పొత్తులో వరంగల్ పశ్చిమ సీటు టీఆర్ఎస్కు వెళ్లి సత్యనారాయణరెడ్డికి టికెట్ వచ్చింది. 2009లో దయాసాగర్, 2012 బై ఎలక్షన్లో దయాసాగర్కు, 2014లో ఎర్రబెల్లి స్వర్ణ, 2018లో మహాకూటమి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్రెడ్డి బరిలో నిలిచారు. దీంతో నాకు టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిన సందర్భాలున్నాయి. 2009లో రాహుల్గాంధీ యూత్ కాంగ్రెస్ కోటాలో నాకు టికెట్ ఖరారైంది. బక్క జడ్సన్ నా ఫోన్ నుంచి దరఖాస్తు చేశారు. జితేందర్సింగ్ నుంచి మీకు టికెట్ కన్ఫాం అంటూ మెసేజ్ వచ్చింది. అర్థం కాక ఆ నంబర్కు ఫోన్ చేస్తే ఢిల్లీ నంబర్ అని తెలిసింది. ఢిల్లీ వెళ్లి టికెట్ విషయం నిర్ధారించుకున్నాను. యూత్ కోటాలో నాతో పాటు ఏడుగురికి టికెట్లు కేటాయించారు. కానీ ఢిల్లీలో జరిగిన మంతనాల తర్వాత నా టికెట్ తీసేశారు. ఇదేంటని అడిగితే వైఎస్ నా భుజంపై చేయి వేసి చెప్పకనే చెప్పారు. ఆ బాధ నాకు ఇప్పటికీ గుర్తుంది.
2023లో మళ్లీ మొదలైన టికెట్ పోరాటం
2023 ఎన్నికల్లో ఎన్నో కుట్రలను దాటుకుని టికెట్ తెచ్చుకున్నాను. రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఆయనను కలిసి, నాకు టికెట్ ఇస్తే కష్టపడి పనిచేస్తానని చెప్పాను. 2009 నుంచి టికెట్ చేజారిపోతోందని, నేను పనిచేసే సమయానికి వేరేవాళ్లు రావడం పరిపాటిగా మారిందని చెప్పాను. ఇస్తే ఇస్తామని చెప్పండి. లేదంటే రాదని కూడా చెప్పండి. నేను కాంగ్రెస్ను వదిలి వెళ్లే వ్యక్తిని కాదు. కానీ క్లారిటీ లేకుండా పనిచేయలేనని, ఇప్పటికే అనేక రకాలుగా నష్టపోయి.. అలసిపోయానని చెప్పడంతో.. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతానన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నుంచి స్వయంగా సానుకూల సంకేతం వచ్చింది. ముందుకు వెళ్లాలని సూచించారు. ఫస్ట్ లిస్ట్లో నా పేరు రావాల్సి ఉన్నా కొందరు అడ్డుకున్నారు. అధిష్ఠానం వద్ద నాపై ఏవేవో చెప్పారు. రీ-సర్వేలు, స్పాట్ సర్వేలు జరిగిన తర్వాత చివరకు నాకు టికెట్ వచ్చింది. సొంత పార్టీలోనూ నన్ను తొక్కే ప్రయత్నాలు జరిగాయి. వీడు వస్తే మాకు రాజకీయ భవిష్యత్ ఉండదనుకునేవాళ్లు ఉన్నారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు.
కేసులు.. ప్రలోభాలు వెంటాడాయి..అయినా కండువా మార్చలేదు
నాపై కేసులు పెట్టి వేధించినప్పుడు పార్టీ మారితే అన్నీ మాఫీ చేస్తామని ప్రలోభాలు పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సొంత పార్టీ కాంగ్రెస్లోనూ కొట్లాటలు ఉన్నాయని చెబుతూ పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటికి వచ్చి మరీ కొందరు అడిగారు. ఇప్పటికీ నాపై 54 కేసులున్నాయి. మర్డర్ కేసులోనూ ఇరికించారు. కుటుంబంలో విషాదం జరిగిన సమయంలో కూడా కేసుల కారణంగా తప్పించుకుని తిరగాల్సి వచ్చింది. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. పార్టీ మాత్రం మారను అని చెప్పాను. నా మెడలో కాంగ్రెస్ కండువా తప్ప మరో కండువాను నేను ఊహించుకోలేదు. మర్డర్ కేసులో ఇరికించినప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మాదిరిగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. ఒక పెద్దమనిషి నా గురించి ఇలాంటి పిచ్చొళ్లవల్లే ఆ పార్టీ ఇంకా బతుకుతోందని అన్నాడు. దాన్ని నేను తిట్టు లాంటి పొగడ్తగా తీసుకున్నాను.
రాహుల్గాంధీ ఫోన్.. నాకది గర్వకారణం
ఒకరోజు కారులో హైదరాబాద్కు వస్తుండగా రాహుల్గాంధీ నుంచి నేరుగా ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాలని పిలిచారు. దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఎంపిక చేసి సమావేశానికి పిలిస్తే తెలంగాణ నుంచి నన్ను ఒక్కరినే పంపించారు. నాకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అప్పుడే సూచించాను. ఇప్పుడు రాహుల్గాంధీ వాటిని అమలు చేస్తున్నారు. మరోసారి రాహుల్గాంధీ, కొప్పుల రాజు ఆన్లైన్లో డీసీసీ సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడమన్నవారే మాట్లాడాలి. అప్పుడు రాహుల్గాంధీ నాయిని రాజేందర్రెడ్డి జీ మాట్లాడండి అని నన్ను పిలిచారు. అది నాకు ఎంతో గర్వంగా అనిపించింది.
నాన్నను డబ్బులు అడగడం మానేశా.. పిల్లనూ ఇవ్వలేదు
ఇంటర్లో చదువు అబ్బడం లేదని, బిజినెస్ చేసుకుంటానని డబ్బులు ఇవ్వమని నాన్నను అడిగాను. ఆయన ఇవ్వనని చెప్పారు. అప్పటి నుంచి నాన్నను డబ్బులు అడగడమే మానేశాను. నా మీద రెండు కేసులు నమోదైన తర్వాత నరేందర్రెడ్డి పెద్ద కొడుకుపై మర్డర్ కేసు అయిందట అంటూ ప్రచారం జరిగింది. చుట్టాలు, పక్కాలు కూడా అదే మాట్లాడుకునేవారు. అప్పట్లో పట్టింపులు ఎక్కువ. కేసులు ఉన్నాయనే కారణంతో నాకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
అప్పటి రాజకీయాల్లో ప్రత్యర్థికీ గౌరవం ఉండేది
అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నాయి. ప్రత్యర్థిని కూడా గౌరవించే సంస్కారం అప్పట్లో ఉండేది. నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఓంకార్పై ఫైర్ కావడంతో ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. నర్సంపేట నుంచి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. రాజకీయాల్లో హత్యలు జరిగిన కాలమే అది. హయగ్రీవాచారిని ప్రత్యర్థులు హత్యలాచారి అని పిలిచేవారు. అయినా ఆయన ఎంజీఎంకు వెళ్లి ఓంకార్ను పరామర్శించారు. అంతా మాపై దాడి చేస్తారనుకున్నాం. కానీ ఆయనను చూసి అంత మంది దారి ఇవ్వడం నాకు గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఎవరో పోటీకి వస్తాడేమోనని ముందే శత్రువుగా చూస్తున్నారు. కానీ అప్పుడున్న రాజకీయ సంస్కారం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు.
వరంగల్ బ్రాండ్ పెంచడమే నా ముందున్న పని
నాకు నా నియోజకవర్గం మాత్రమే కాదు, వరంగల్ బ్రాండ్ పెరగాలి. ముఖ్యమంత్రి వద్ద అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్టు, రింగ్రోడ్డు వంటి పనులకు నిధులు అడిగాను. రూ.500 కోట్లతో వాటర్ సప్లై పైప్లైన్ను మెరుగుపరుస్తున్నాం. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించాం. ఐటీఐ కాలేజీకి రూ.25 కోట్లు తీసుకొచ్చాను. కాజీపేట బ్రిడ్జి పనులు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయి. త్వరలో పూర్తి చేస్తాం. కాజీపేట బస్టాండ్ కూడా మంజూరు చేయించాను. నాకు అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేది. అది నెరవేరింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అడిగాను. నాకు పని చేయడం ఇష్టం. అందుకే పార్టీ పదవి అడిగాను. పెద్దలు ఏ పదవి ఇచ్చినా నాకు బోనస్సే.
బిడ్డకు టికెట్ ఇస్తే బరిలోకి
నా బిడ్డ గోదాదేవి మంచి డాక్టర్. 2014లోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తోంది. 240 మంది బీఎల్ఓలు, 240 మంది బీఎల్ఏలను సమన్వయం చేసింది. ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి వరంగల్ పశ్చిమలో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓట్లు కోల్పోకుండా పనిచేస్తోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే గోదాదేవి తప్పకుండా పోటీ చేస్తుంది. డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రిజర్వేషన్లు మారొచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నేపథ్యంలో మరోసారి రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. డివిజన్ల సంఖ్య కూడా పెరగొచ్చు.
‘డక్కమొక్కిలు…తింటేనే జీవితం తెలుస్తుంది’
నేను హైస్పీడ్, టఫ్గా ఉంటాను. ఒకసారి స్నేహితులతో కలిసి ఐదు బైక్లపై ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేశాం. ఆ విషయం అమ్మకు చెప్పినా ఆమె అడ్డుచెప్పలేదు. తర్వాత ఎందుకు అడ్డుచెప్పలేదని అడిగాను. అందుకు ఆమె, డక్కమొక్కిలు తింటూ పెరిగితేనే జీవితంలో అన్నీ తెలుస్తాయి అని చెప్పింది. ఆ మాట నాకు చాలా నచ్చింది. నిజమే.. జీవితంలో ఎదురయ్యే దెబ్బలు, కష్టాలు, పోరాటాలే మనిషికి అన్నీ నేర్పిస్తాయి. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా ప్రయాణం దాడులు, ప్రతిదాడులు, కేసులు, పోరాటాలతోనే సాగింది. విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ కోసం తలపడ్డాను. రాజకీయాల్లో ఘర్షణలు, కేసులు ఎదుర్కొన్నాను. సొంత పార్టీలోనే తొక్కే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ మారితే కేసులు మాఫీ చేస్తామన్న ప్రలోభాలు వచ్చినా లెక్కచేయలేదు. పోరాటమే నా రాజకీయ ప్రస్థానానికి పునాది. అదే నా బలం.
కాకతీయ,తెలంగాణ బ్యూరో/
అరెల్లి కిరణ్ గౌడ్
-7396604266

