ఏసీబీ వలలో తహసీల్దార్ సృజన్కుమార్
వారసత్వ భూమి మార్పిడికి రూ. 15 వేలు డిమాండ్
బేరసారాల అనంతరం రూ. 14 వేలకు ఒప్పందం
లంచం తీసుకుంటుండగా గోవిందరావుపేట అధికారి పట్టివేత
కాకతీయ, ములుగు ప్రతినిధి : పూర్వీకుల వ్యవసాయ భూమి వారసత్వ హక్కు నమోదు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. 14 వేల లంచం తీసుకుంటూ గోవిందరావుపేట తహసీల్దార్ నెల్లుట్ల సృజన్కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ట్రాప్ నిర్వహించి నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ ప్రెస్నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత పేరుతో ఉన్న పూర్వీకుల వ్యవసాయ భూమికి వారసత్వ హక్కు నమోదు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు తహసీల్దార్ తొలుత రూ. 15 వేల లంచం డిమాండ్ చేశారు. అనంతరం బేరసారాల ద్వారా రూ. 14 వేలకు తగ్గించారు. ఈ మొత్తాన్ని స్వీకరించి కుడివైపు ట్రౌజర్ జేబులో పెట్టుకున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కుడిచేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. లంచం స్వీకరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సృజన్కుమార్ను అరెస్ట్ చేసి వరంగల్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.

