డీటీసీ సార్.. ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!
ములుగు డీటీవో అక్రమాలపై మీ మౌనం కొమ్ముకాసేలా లేదా..?
ఆధారాలతో సహా కాకతీయ వరుస కథనాలు
అక్రమాలను బయటపెట్టినా విచారణేది..? చర్యలేవీ..?
నీతులు, నిబంధనలు జనాలేకేనా..? ఆర్టీఏ అధికారులకు వర్తించవా?
ప్రశ్నలకు సమాధానమెందుకు ఇవ్వరు.. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎందుకు చేయరు..!
ప్రజల పన్నులతోనే కదా మీరు జీతం తీసుకునేది..?!
ములుగు జిల్లా కలెక్టర్ కలుగజేసుకోని విచారణ చేపట్టాలని జనాల డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో /ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖలో చోటుచేసుకుంటున్న వరుస వ్యవహారాలపై ‘కాకతీయ’ ఆధారాలతో సహా కథనాలు ప్రచురిస్తున్నా.. శాఖ ఉన్నతాధికారుల స్పందన మాత్రం మౌనానికే పరిమితమవుతోంది. ముఖ్యంగా జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) ఈశ్వర్ సింగ్ ఠాకూర్ విధుల్లో లేని సమయంలో ఆయన అధికారిక లాగిన్ ద్వారా ధ్రువపత్రాలు జారీ అయిన అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారి కార్యాలయంలో లేకపోతే ఆయన లాగిన్ ఎలా పనిచేసింది? ఆ లాగిన్ను ఎవరు వినియోగించారు? డిజిటల్ సంతకం ఎలా ఉపయోగించారు? ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారా? అప్పగిస్తే ఆ ఉత్తర్వులు ఎక్కడ? వంటి కీలక ప్రశ్నలు తలెత్తుతున్నా.. వాటికి సమాధానాలు చెప్పాల్సిన డీటీసీ ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

విధుల్లో లేకుండానే ధ్రువపత్రాలా..?
ఇటీవల సెప్టెంబర్ 2న ములుగు జిల్లా రవాణా శాఖ అధికారి ఈశ్వర్ సింగ్ ఠాకూర్ కోర్టు పనిమీద నిర్మల్ జిల్లాకు వెళ్లిన సమయంలో ములుగు కార్యాలయంలో ఆయన లాగిన్పై కొన్ని ధ్రువపత్రాలు జారీ అయినట్లు సమాచారం. అధికారి ఒకచోట.. ఆయన అధికారిక లాగిన్ మరోచోట పనిచేసిందా? ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, ఫిట్నెస్ వంటి కీలక ధ్రువపత్రాల జారీకి ఉపయోగించే లాగిన్, డిజిటల్ సంతకం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎలా సాధ్యమైంది? అధికారి విధుల్లో లేని సమయంలో జరిగిన లావాదేవీలపై కనీసం ప్రాథమిక విచారణ చేయాల్సిన బాధ్యత డీటీసీకి లేదా? నిబంధనలు పాటించామని చెబితే.. ఆ రోజు హాజరు రికార్డు, లాగిన్ లాగ్, జారీ చేసిన ధ్రువపత్రాల వివరాలు బయటపెడితే నిజం తేలదా? అన్నది ఉన్నతాధికారులే తేల్చాలి.
‘లాగిన్’ ఎవరి చేతిలో..?
అధికారి లేని సమయంలో ఆయన లాగిన్ ద్వారా లావాదేవీలు జరిగితే.. ఆ వివరాలు ఎవరి వద్ద ఉన్నాయి? పాస్వర్డ్, డిజిటల్ కీ భద్రతను ఎవరు చూసుకున్నారు? ఏ కంప్యూటర్ నుంచి లాగిన్ అయ్యారు? ఏ సమయంలో లావాదేవీలు జరిగాయి? ఎన్ని ధ్రువపత్రాలు జారీ అయ్యాయి? అన్నది సాంకేతిక రికార్డులు చెబుతాయి కదా. మరి ఆ రికార్డులను పరిశీలించేందుకు అధికారులకు అడ్డంకి ఏమిటి? తప్పేమీ జరగలేదంటే విచారణకు ఎందుకు వెనుకడుగు? తప్పు జరిగితే చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం? ప్రజలకు చిన్న నిబంధన ఉల్లంఘనకే జరిమానాలు విధించే రవాణా శాఖలో అధికారిక లాగిన్ విషయంలో మాత్రం ఇంత ఉదాసీనత ఎందుకు? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
డీటీవోపై వరుస వివాదాలు.. డీటీసీ నిఘా ఏది..?
ములుగు రవాణా శాఖ కార్యాలయంలో డీటీవో వ్యవహారశైలిపై కూడా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం, భయభ్రాంతులకు గురిచేయడం, నిబంధనలను పక్కనపెట్టి తాను చెప్పిన పని చెప్పినట్లే చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారన్న సమాచారం ఉంది. మరోవైపు సదరు అధికారికి సన్నిహితుడిగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇసుక లారీల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న వ్యవహారంలో డీటీవోకు వాటాలు వెళ్తున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఈ అంశంపై తనిఖీ రికార్డులు, జరిమానాలు, వాహనాల వివరాలు, సిబ్బంది విధుల సమాచారాన్ని పరిశీలించారా? వసూళ్ల వ్యవహారంపై ఎప్పుడైనా విచారణ చేశారా? లేక ఫిర్యాదులు, కథనాలు వచ్చినా ఫైలు కదలదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘కాకతీయ’ వరుస కథనాలు..విచారణేది?
ములుగు రవాణా శాఖలోని వ్యవహారాలపై ‘కాకతీయ’ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. అయినా డీటీసీ స్థాయిలో స్పష్టమైన స్పందన కనిపించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. కథనాలు తప్పయితే ఖండించండి.. వాస్తవాలుంటే విచారణ చేయండి.. మరి రెండూ చేయకుండా మౌనం ఎందుకు? అధికారిక లాగిన్ వినియోగం వంటి తీవ్రమైన అంశం బయటకు వచ్చినప్పుడు కనీసం రికార్డులు పరిశీలించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు లేదా? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన శాఖే ప్రశ్నలకు దూరంగా ఉంటే.. ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? ఈ వ్యవహారంపై వివరణ తెలుసుకునేందుకు సంబంధిత ఉన్నతాధికారి డీటీసీని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లభించలేదు. అధికారిక వ్యవహారంపై వివరణ కోరినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కూడా చర్చకు దారితీసింది. డీటీసీ గారూ.. ప్రశ్నలకు సమాధానం చెప్పడం మీ బాధ్యత కాదా? ఫోన్ ఎత్తి వాస్తవం చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారో? ప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అన్న విమర్శలు డీటీసీపై వినిపిస్తున్నాయి.
ప్రజల పన్నులతో జీతాలు.. జవాబుదారీ ఎక్కడ?
ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకే జవాబుదారీగా ఉండాలి కదా. వాహనదారులకు నిబంధనలు చెప్పే ఆర్టీఏ అధికారులు తమ శాఖలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది కూడా ప్రజలకు తెలియాలి. నీతులు, నిబంధనలు జనాలకేనా? ఆర్టీఏ అధికారులకు వర్తించవా? అన్న ప్రశ్నకు డీటీసీ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. వరుస కథనాలు, లాగిన్ వినియోగంపై వెలుగులోకి వచ్చిన వివరాలు, ఇసుక లారీల వ్యవహారంపై వస్తున్న సమాచారం నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కలుగజేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డీటీవో ఈశ్వర్ సింగ్ ఠాకూర్ విధుల్లో లేని సమయంలో లాగిన్ వినియోగం, ధ్రువపత్రాల జారీ, డిజిటల్ సంతకం భద్రత, సిబ్బందితో వ్యవహారశైలి, ఇసుక లారీల తనిఖీలు, వసూళ్ల వ్యవహారం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హాజరు రికార్డులు, సిస్టమ్ లాగ్లు, ఐపీ వివరాలు, డిజిటల్ సంతకం వినియోగం, జారీ చేసిన ధ్రువపత్రాలు పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా డీటీసీ స్పందిస్తారా? లేక మౌనంతోనే వ్యవహారాన్ని నెట్టుకొస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

