ఐఈడీ పేలుడులో వ్యక్తి మృతి
వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లిన ఆరుగురు
కర్రెగుట్టల్లో పామునూరు పోలీస్ క్యాంపు సమీపంలో ఘటన
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం ఏదుల్లా చెరువు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లిన మడకం నాగేశ్వరరావు (55) ఐఈడీ పేలుడులో మృతి చెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నాగేశ్వరరావుతో పాటు మరో ఐదుగురు బుధవారం అడవికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో పామునూరు పోలీస్ క్యాంపునకు సమీపంలోని కర్రెగుట్టల ప్రాంతంలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో నాగేశ్వరరావు మృతి చెందడంతో ఏదుల్లా చెరువు కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సీఐ ముత్యం రమేష్, ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐఈడీ అక్కడ ఎలా అమర్చబడింది, పేలుడుకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


