ఆర్భాటంగా హామీలు.. అమలులో కొర్రీలు!
మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం
రైతుల ‘అరిగోస’.. గన్ని బ్యాగులు లేక అన్నదాత ఆగమాగం
ఒక్కో సంచి రూ. 30 పెట్టి కొనుగోలు
మద్దతు ధర రూ. 2,400 ఉంటే.. రూ. 1,600కే తెగనమ్ముకుంటున్న రైతన్న
వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే రాష్ట్రవ్యాప్త ధర్నాలు
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజం
రాయపర్తిలో నేషనల్ హైవేపై ఎర్రబెల్లి బైఠాయింపు
కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
కాకతీయ, రాయపర్తి : “రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం” అని ఆర్భాటంగా హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. శనివారం రాయపర్తి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గన్ని బ్యాగులు లేవు.. లారీలు రావు!
ధర్నా సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెడుతున్న కొర్రీల వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. “హామీలు మాకొద్దు.. గన్ని బ్యాగులు కావాలి. లారీలు పంపి వెంటనే కొనుగోలు వేగవంతం చేయండి” అని నినదించారు. మక్కలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల రైతులు గత్యంతరం లేక బయట వ్యాపారులకు రూ. 1,600 నుంచి రూ. 1,800 మధ్య తక్కువ ధరకే అమ్ముకొని భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు లేకపోవడంతో రైతులు ఒక్కో సంచిని రూ. 30 వెచ్చించి సొంతంగా కొనుక్కుంటున్నారని తెలిపారు.
కలెక్టర్తో ఫోన్లో సంభాషణ..
ధర్నా స్థలం నుంచే ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్తో చరవాణిలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పేరుకుపోయాయని, అకాల వర్ష సూచనతో రైతులు ప్రాణసంకటంలో ఉన్నారని వివరించారు. తక్షణమే మక్కలు నిల్వ ఉంచేలా గోడౌన్లను ఏర్పాటు చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు వర్షం భయంతో రైతులు కుమిలిపోతున్నారని, రేవంత్ సర్కారు రైతుపై రాక్షసత్వం ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వానికి అల్టిమేటం
ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి వారం రోజుల్లోగా మక్కల కొనుగోళ్లను పూర్తి చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ నిరసనకారులతో చర్చలు జరిపి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూనావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్, పూస మధు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

