ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీసు అధికారులకు సీపీ సన్ ప్రీత్ సింగ్
చిల్పూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సీపీ
పెండింగ్ కేసులు, రౌడీ షీట్ల రికార్డుల పరిశీలన
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలకు ఆదేశాలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూర్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి పోలీస్ అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, ఐటీ విభాగం, పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్ కేసుల రికార్డులను సీపీ తనిఖీ చేశారు.
గ్రామాల్లో శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామస్తుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అక్రమ ఇసుక రవాణా, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీపీ
తనిఖీల అనంతరం సీపీ సన్ ప్రీత్ సింగ్ చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత, ఆలయంలో జరిగే కార్యక్రమాల గురించి ఆలయ పూజారులు సీపీకి వివరించారు. ఈ తనిఖీల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీం శర్మ, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

