భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి
కాకతీయ, వరంగల్ సిటీ : ఓరుగల్లులో కొలువైన చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఆలయ చైర్మన్ డాక్టర్ బి.శివసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చక బృందం మంగళవాద్యాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికింది. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం మంత్రి, పీఠాధిపతి అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపంలో వేదపండితులు మంత్రికి మహదాశీర్వచనం చేసి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కంచి శ్రీస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసి, స్వయంగా ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మయూరి రామేశ్వరరావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

