మేడారంలో ఇసుక దోపిడి!
జంపన్నవాగులో యథేచ్ఛగా తవ్వకాలు..
టిప్పర్లతో భారీగా రవాణా…..
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ తవ్వకాలు?
కన్నెత్తి చూడని అధికారులు..
ప్రజాప్రతినిధుల పాత్రపై అనుమానాలు…..
కాకతీయ ములుగు ప్రతినిధి: సమ్మక్క-సారలమ్మ వనదేవతల జాతరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం ఇప్పుడు ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతోంది. జాతర ముగిసిన అనంతరం జనసంచారం తగ్గడాన్ని ఆసరాగా చేసుకున్న ఇసుక అక్రమ రవాణాదారులు జంపన్నవాగును టార్గెట్గా చేసుకుని భారీగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి ఒడ్డుకు తరలించడం, అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..?
స్థానికుల ఆరోపణల ప్రకారం మేడారం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవసరాల పేరుతో జంపన్నవాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు? అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టి, ఒడ్డున నిల్వ చేసి అనంతరం టిప్పర్ల ద్వారా బహిరంగ మార్కెట్కు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు జంపన్నవాగు సహజ స్వరూపానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టపగలే టిప్పర్ల రాకపోకలు…..
జంపన్నవాగు నుంచి తవ్విన ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకటి రెండు టిప్పర్లు కాకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుకను తరలిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. రోజుల తరబడి తవ్వకాలు కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు.

గతంలో టిప్పర్ పట్టుబడినా..
మేడారం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో గత నెలలో నార్లాపూర్ వద్ద అధికారులు ఓ టిప్పర్ను గుర్తించి పట్టుకోవడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. మేడారం ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను అధికారులు పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ….?
జంపన్నవాగులో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి రాలేదా? లేక తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తవ్వకాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు దూరంగా ఉండటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నప్పటికీ చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు అంటున్నారు.
ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ఆరోపణలు….
ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు తెలియకుండా ఉండటం సాధ్యమేనా? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. మేడారం జాతరతో పాటు జంపన్నవాగుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతంలో ఇసుకను విచ్చలవిడిగా తవ్వడం వల్ల భవిష్యత్లో పర్యావరణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగు సహజ ప్రవాహానికి, భూగర్భ జలాలపై ప్రభావం పడకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఎంత మేరకు అనుమతించారు? ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తీసిన ఇసుక వాస్తవంగా ఎక్కడ వినియోగిస్తున్నారు? ఎన్ని టిప్పర్ల ద్వారా ఇసుక తరలించారు? ప్రభుత్వానికి ఎంత మేర ఆదాయం వచ్చింది? అనే అంశాలపై అధికారులు పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

