ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ కీలక భేటీ
కేసీఆర్ అధ్యక్షతన సంస్థాగత నిర్మాణంపై చర్చ
హాజరైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహించిన ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ప్రధాన కార్యదర్శులు, ఉభయ సభల పక్షాల ఉప నాయకులు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జిల నియామకం, సభ్యత్వ నమోదులో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు టి.హరీశ్ రావు, పి.సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఎస్.మధుసూదనాచారి, డిప్యూటీ లీడర్లు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ముఖ్య నేతల సమక్షంలో
ఈ కీలక సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, టి.జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ అలీ హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాల రూపకల్పన వంటి అంశాలూ ఈ సమావేశం అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.

