చోరీల ముఠా అరెస్ట్
మంగపేటలో వరుస దొంగతనాలకు పాల్పడిన 8మంది అరెస్ట్
బంగారం, వెండి, మూడు బైక్లు, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్
కాకతీయ, ఏటూరునాగారం: మంగపేట మండలంలో ఇటీవల వరుస చోరీలతో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుములు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మంగపేట పోలిస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మంగపేట పోలీస్స్టేషన్ పరిధిలోని గంపొనిగూడెం, కమలాపురం, బోరనర్సాపూర్ గ్రామాల్లో ఇటీవల పలు చోరీలు చోటుచేసుకోవడంతో ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నామన్నారు.
నిందితులంతా పాత నేరస్థులే
అరెస్టైన వారిలో కమలాపురం గ్రామానికి చెందిన నిమ్మల వినయ్కుమార్, పరమాత్ముల శివ, బోయి పరశురాం, రాయరకుల సారయ్య, నిమ్మల కుమార్, భూక్య ప్రవీణ్ అలియాస్ బెంజ్, ప్రస్తుతం చిన్నబోయినపల్లిలో ఉంటున్న మహ్మద్ బిజిగిరి మరియు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బండి తరుణ్ ఉన్నారు. విచారణలో నిందితులపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు నమోదైనట్లు, వీరంతా జైలు శిక్ష అనుభవించి వచ్చిన పాత నేరస్థులని తేలిందని పోలీసులు వెల్లడించారు. మంగపేట, కొత్తగూడెం, నిజామాబాద్ ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులు, మూడు బైక్లు, రూ.10 వేల నగదు, 30 కిలోల రాగి వైరు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వేసవి కాలంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా, కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ అభినందించారు. దర్యాప్తులో ఏటూరునాగారం సీఐ ఎ. శ్రీనివాస్, ఎస్ఐలు టీవీఆర్ సూరి, ఎల్. శ్రీకాంత్, కానిస్టేబుళ్లు మోహన్, రమేష్, ప్రసాద్, నరేష్ కీలక పాత్ర పోషించారు.

