రౌడీ షీటర్లపై సానుభూతి వద్దు
ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
కేయూసీ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
పోలీస్ రికార్డులు తనిఖీ.. కేసుల సాల్వ్పై ఆరా
కాకతీయ, హనుమకొండ : భూ తగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం పేరుతో సెటిల్మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, స్టోర్ రూమ్, కేసు ప్రాపర్టీ గదులు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలను పోలీస్ కమిషనర్ సమీక్షించి యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ఆరా తీశారు. తగాదాల్లో తలదూర్చే రౌడీ షీటర్లతో పాటు బెదిరింపులకు పాల్పడే వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. రౌడీ షీటర్ల పట్ల ఎలాంటి సానుభూతి ధోరణి ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐలు తమకు కేటాయించిన సెక్టార్లలో నేరాల నియంత్రణతో పాటు ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ నర్సింహరావు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐలు నవీన్ కుమార్, కళ్యాణ్ కుమార్, రాజమౌళి పాల్గొన్నారు.

