ఏసీబీ వలలో నర్సింహులపేటలో ఎంపీడీవో
రూ.45వేల నగదు స్వీకరిస్తుండగా ఎంపీడీఓ రాధికా పట్టివేత
ఎంపీఓ కిన్నెరా యాకయ్య, ఎంపీడీఓ కుమారుడు సైతం అరెస్టు
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన దాడులు స్థానికంగా సంచలనం సృష్టించాయి. ఒక వెంచర్ అనుమతి కోసం భారీగా లంచం డిమాండ్ చేసిన ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య మరియు ఎంపీడీఓ కుమారుడు ఏసీబీకి చిక్కారు. పడమటి గూడెం గ్రామంలో ఒక వెంచర్ అనుమతికి సంబంధించి సదరు ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్యలు రూ. 1 లక్ష లంచం డిమాండ్ చేశారు. సెటిల్మెంట్లో భాగంగా రూ. 45 వేల నగదు తీసుకుంటుండగా, సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో అనధికారిక వ్యవహారాలు నిర్వహిస్తున్న ఎంపీడీఓ కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

