మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ?
విద్యపై ప్రభుత్వానికి చిన్నచూపు
విద్యాశాఖ మంత్రి నియామకంపై నిర్లక్ష్యం
వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు
పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి
బీఆర్ఎస్ నేత భూక్య జంపన్న
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించకపోవడం పట్ల బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, కీలకమైన విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న వివక్షను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా జంపన్న మాట్లాడుతూ, విద్యార్థులు కొత్త ఆశలతో పాఠశాలలకు వెళ్తుంటే, అటు ఉపాధ్యాయులు బోధనకు సిద్ధంగా ఉన్నారని, కానీ విద్యాశాఖ దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన మంత్రి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉన్నాయని, భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
హామీలకే పరిమితమైన కాంగ్రెస్
ఎన్నికల సమయంలో విద్యారంగ అభివృద్ధిపై అనేక గొప్ప మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని జంపన్న ఆరోపించారు. సమస్యలను గాలికొదిలేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ కీలక సమయంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, వెంటనే విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి పాఠశాలల్లోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

