ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లు ఆపాలి
ప్రశ్నిస్తే లారీ డ్రైవర్లపై కాంట్రాక్టర్ల సిబ్బంది దాడులు
అక్రమ వసూళ్లపై అడిగితే లోడ్ చేయకుండా వేధింపులు
వీరాపురం క్వారీలో రాత్రంతా లోడింగ్కు పడిగాపులు
కాంట్రాక్టర్లకు అధికారుల వత్తాసు వెనుక కారణాలేంటో వెల్లడించాలి
టీజీఎండీసీ అధికారులు చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం
పెద్ద అంబర్ పేట లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్
కాకతీయ, హైదరాబాద్ : ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని టీజీఎండీసీ కార్యాలయం ఎదుట ఇసుక లారీ అసోసియేషన్ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించే డీడీ డబ్బులకు అదనంగా లోడుకు రూ.2000 నుంచి 3000 వరకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా పెద్ద అంబర్ పేట లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఆయా జిల్లాల పీవోలతో పాటు టీజీఎండీసీ ఏజీఎం, జీఎం,ఎండీ వరకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూనే ప్రశ్నించిన లారీ యజమానులపై, డ్రైవర్లపై దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.


సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని వీరాపురం ఇసుక క్వారీలో అదనంగా ఇసుక డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు లోడ్ చేయకుండా నిలిపేశారని అన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కాంట్రాక్టర్లకు సహకరించడం వెనుక మతలబేంటో అర్థం కావడం లేదని అన్నారు. న్యాయంగా డీడీ చెల్లించి ర్యాంపులకు వెళ్లిన తమను కాంట్రాక్టర్లు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లు, టీజీఎండీసీ అధికారుల తీరులో మార్పు రాకుంటే న్యాయ పోరాటానికైన సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. మంగళవారం టీజీఎండీసీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు అనేక లారీ అసోసియేషన్ సంఘాలు తమ మద్దతు తెలిపినట్లు భాస్కర్ గౌడ్ వెల్లడించారు.

