తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో సిగ్నల్ కష్టాలు
– గంటల తరబడి బ్యాంకు ముందు పడిగాపులు
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు,వృద్ధులు
– బ్యాంకులో తరచూ తలెత్తుతున్న సిగ్నల్ సమస్యలు
– శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు,రైతుల డిమాండ్
కాకతీయ,రాయపర్తి :మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టిజిబి) రాయపర్తి శాఖలో సాంకేతిక సమస్యలు,సిగ్నల్ లోపం కారణంగా శనివారం ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధులు,రైతులు,మహిళలు తమ పెన్షన్లు,పంట పెట్టుబడి సాయం,పొదుపు డబ్బులు డ్రా చేసుకోవడం,డిపాజిట్ చేయడానికి ప్రతి రోజు వందలాదిమంది ఖాతాదారులు ఈ బ్యాంకుకు వస్తుంటారు.బ్యాంకులో సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో అత్యవసర ఖర్చులకోసం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన ఖాతాదారులకు నిరాశే మిగిలింది.ఒకవైపు వానలు పడుతున్నా లెక్క చేయకుండా,మరోవైపు చేతుల పైసలు లేక,అవసరాలకు డబ్బులు అందుతాయనే ఆశతో వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు ఖాళీ చేతులతో ఇళ్లకు వెనుదిరిగాల్సి వచ్చింది.

*సాగు వేళ సాంకేతిక కష్టాలు..
సిగ్నల్ లోపం కారణంగా ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బ్యాంకులో తరచూ సర్వర్ డౌన్ కావడం,సిగ్నల్ సరిగ్గా అందకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.విత్తనాలు ఎరువుల కొనుగోలుకు,పెట్టుబడి సాయం కోసం రైతులు పనులన్నీ మానుకుని బ్యాంకుకు రావాల్సి వస్తుంది.తీరా బ్యాంకుకు వస్తే…ఇక్కడ సిగ్నల్ లేదు,సర్వర్ పని చేయడం లేదు అనే సమాధానం ఎదురవుతుండడంతో అటు వ్యవసాయ పనులకు,ఇటు నిత్యవసరాలకు డబ్బులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*రైతుల డిమాండ్
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాయపర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో ఎదురవుతున్న సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు,రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై బ్యాంక్ మేనేజర్ హుస్సేన్ ను వివరణ కోరగా..శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా బ్యాంకు భవనం పైన ఉన్న నెట్వర్క్ యాంటీన కదిలిందని, అందుకే సిగ్నల్ సమస్య ఎదురయిందటూ సమాధానం ఇచ్చారు.సాంకేతిక సిబ్బందితో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

