అంకితభావంతో పనిచేస్తేనే పదోన్నతులు
తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి
పదోన్నతి పొందిన అధికారులకు ఘన సన్మానం
మండల అభివృద్ధిలో వారి సేవలు చిరస్మరణీయం
కాకతీయ, గీసుగొండ : అధికారులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే పదోన్నతులు సహజంగానే లభిస్తాయని, అదే స్ఫూర్తితో ఇకపై మరింత మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి అన్నారు. గీసుగొండ మండలంలో విధులు నిర్వహించి పదోన్నతి పొందిన ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఎంపీఓ ఎం.డి. షాజహాన్లకు శుక్రవారం మండల కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మరియు ఎంపీడీఓ మాట్లాడుతూ, పాక శ్రీనివాస్, ఎం.డి. షాజహాన్లు మండల అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజలకు చేరువగా ఉంటూ సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. పదోన్నతి సాధించడం వారి పనితీరుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. తనకు లభించిన గౌరవం పట్ల ఎంపీడీఓ పాక శ్రీనివాస్ స్పందిస్తూ.. గీసుగొండలో పనిచేసిన కాలం ఎప్పటికీ గుర్తుంటుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే తన విధులు సజావుగా నిర్వర్తించగలిగానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీఓ టి. శేషాంజన్ స్వామి, సూపరింటెండెంట్ కమలాకర్, పలువురు సర్పంచులు, టీఎన్జీవో నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

