- చిన్న వర్షానికే నీటమునిగి ప్రజలకు నిత్య అవస్థలు
- తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
- బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ డిమాండ్
- రోడ్డుపై వరినాట్లు… ప్రభుత్వానికి హెచ్చరిక
- 54వ డివిజన్లో బీజేపీ వినూత్న నిరసన
- పోచమ్మకుంట–డబ్బాల ప్రాంతంలో బురదమయంగా రోడ్లు
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లా 54వ డివిజన్ పరిధిలోని పోచమ్మకుంట–డబ్బాల ప్రాంతంలో అధ్వానంగా మారిన రహదారులపై బీజేపీ నాయకులు బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. బురదమయంగా మారిన రోడ్డుపై వరినాట్లు వేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. రహదారుల దుస్థితి కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే రహదారులపై నీరు నిలిచిపోతుండడంతో గుంతలు కనిపించకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రతిరోజూ స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శంకుస్థాపనలతోనే సరిపెట్టారంటూ విమర్శ
రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నెలలు గడిచినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని పేరం గోపికృష్ణ విమర్శించారు. అడుగడుగునా గుంతలు ఏర్పడి రహదారులు ప్రమాదకరంగా మారాయని, వర్షం కురిసినప్పుడల్లా రాకపోకలు దాదాపు స్తంభిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే రహదారుల మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే రోడ్డుపై వరినాట్లు వేసి ఈ వినూత్న నిరసన నిర్వహించినట్లు తెలిపారు.

