సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల సత్తా
నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పోటీల్లో ప్రతిభ
పలు విభాగాల్లో బహుమతులు కైవసం
పోస్టర్ పెయింటింగ్లో కే.స్ఫూర్తికి ప్రథమ బహుమతి
రాష్ట్రస్థాయి పోటీలకు కే.స్ఫూర్తి ఎంపిక
కాకతీయ, హనుమకొండ : నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ జిల్లా స్థాయి పోటీల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, యువతలో అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పోస్టర్ పెయింటింగ్, స్లామ్ పొయెట్రీ, గ్రూప్ డాన్స్, స్లోగన్ రైటింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోస్టర్ పెయింటింగ్లో బీజెడ్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని కే.స్ఫూర్తి ప్రథమ బహుమతి సాధించింది. స్లామ్ పొయెట్రీలో బీఏ రెండో సంవత్సరం విద్యార్థిని వి.అంజలి ద్వితీయ బహుమతి, గ్రూప్ డాన్స్లో త్రినేత్ర అండ్ గ్రూప్ ద్వితీయ బహుమతి, స్లోగన్ రైటింగ్లో ఎంసీఎస్ఎస్ మూడో సంవత్సరం విద్యార్థిని బి.దివ్య తృతీయ బహుమతి సాధించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పోస్టర్ పెయింటింగ్లో ప్రథమ బహుమతి సాధించిన కే.స్ఫూర్తి ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రస్థాయిలోనూ రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అధ్యాపకులు ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోలి శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మానస, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమ, డాక్టర్ శైలజతో పాటు కళాశాల సిబ్బంది విజేతలను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక బాధ్యత, సృజనాత్మకత, కళా రంగాల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.

