కోర్టు ఆదేశాలు బేఖాతార్
ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్న భూపాలపల్లి డీఈవో
లోన్ తీసుకున్న ఉపాధ్యాయుడికి ఫుల్ జీతం
ష్యూరిటీ ఇచ్చిన టీచర్ జీతంలో కట్
పరిస్థితిపై కోర్టు ఆగ్రహం.. వెంటనే చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖకు ఆదేశం
కోర్టు ఆదేశాల అమలును పట్టించుకోని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం
కాకతీయ, భూపాలపల్లి : ఓ ఉపాధ్యాయుడు తీసుకున్న రుణానికి ష్యూరిటీగా నిలిచిన మరో ఉపాధ్యాయుడి జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నప్పటికీ.. అసలు రుణం తీసుకున్న ఉపాధ్యాయుడి జీతం నుంచి మాత్రం ఎలాంటి కోతలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుని జీతం నుంచి మొత్తాన్ని మినహాయించి చెల్లించాలని ఆదేశించినా.. ఆ ఆదేశాల అమలు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం జెడ్పీఎస్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న అడెపు వెంకటేశ్వర్లు రుణ వ్యవహారంలో ష్యూరిటీగా ఉన్నట్లు కోర్టు పరిధిలోకి వెళ్లిన కేసు ద్వారా తెలుస్తోంది. రుణ బకాయిలకు సంబంధించి శ్రీ రామం చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హనుమకొండ నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించింది. సంస్థకు మొత్తం రూ.11,20,821 బకాయి ఉన్నట్లు పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లు జీతం నుంచి రూ.3,73,607 మొత్తాన్ని మినహాయించాలని డీఈవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
డీఈవో ఉత్తర్వులు.. అమలు ఏది?
కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. రాజేందర్ 2026 జూలై 22న రంగాపురం జెడ్పీఎస్ఎస్ హెడ్మాస్టర్కు ఉత్తర్వులు జారీ చేశారు. జీతం నుంచి నిర్దేశిత మొత్తాన్ని మినహాయించి హనుమకొండ నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పేరిట డీడీ రూపంలో చెల్లించాలని ఆదేశించారు. అలాగే తీసుకున్న చర్యలపై వెంటనే తమ కార్యాలయానికి సమాచారం అందించాలని స్పష్టం చేశారు. అయితే ఆ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులు దాటుతున్నా.. కోర్టు ఆదేశాల మేరకు జీతం నుంచి మినహాయింపులు జరిగాయా? మినహాయించిన మొత్తం కోర్టుకు చేరిందా? అనే విషయాలపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ తర్వాతి పరిణామాలను పర్యవేక్షించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
లోన్ తీసుకున్న వ్యక్తికి ఫుల్ జీతం?
ఈ వ్యవహారంలో ప్రధానంగా మరో ప్రశ్న తలెత్తుతోంది. రుణం తీసుకున్న వ్యక్తి జీతం నుంచి కాకుండా ష్యూరిటీ ఇచ్చిన ఉపాధ్యాయుడి జీతం నుంచి మాత్రమే కోతలు ఎందుకు? అన్నదే ఆ ప్రశ్న. ఒకవైపు బాధిత ఉపాధ్యాయుడి జీతం నుంచి మినహాయింపులు జరుగుతున్నట్లు చెబుతుండగా.. మరోవైపు అసలు రుణగ్రహీతకు పూర్తి జీతం అందుతున్న పరిస్థితి ఉంటే దానిపై అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జాప్యం జరగడం, సంబంధిత ఉద్యోగుల జీతాల విషయంలో భిన్నమైన పరిస్థితులు ఉండటం పట్ల బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డీఈవో స్వయంగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. వాటి అమలుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జీతం నుంచి ఎంత మొత్తం మినహాయించారు? మినహాయించిన మొత్తాన్ని కోర్టుకు ఎప్పుడు చెల్లించారు? అసలు రుణగ్రహీత జీతం నుంచి ఎందుకు మినహాయింపులు చేయలేదు? అనే ప్రశ్నలకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి, కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి కారణాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

