రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా!
వ్యవసాయ భూమిగా పట్టా.. మోకాపై వ్యవసాయేతర వినియోగం
లేఅవుట్ చేసి 50–60 మందికి ప్లాట్ల విక్రయం?
కోర్టు వివాదం నడుస్తుండగానే మట్టి డంపింగ్.. రైతుబంధుపైనా సందేహాలు
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు.. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్
కాకతీయ, గీసుగొండ : రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 160పై చర్చకు దారితీశాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 2.10 ఎకరాల భూమిలో గతంలో లేఅవుట్ చేసి సుమారు 50 నుంచి 60 మందికి ప్లాట్లు విక్రయించినట్లు సమాచారం. అనంతరం ప్లాట్ల కొనుగోలుదారులు, విక్రయదారుల మధ్య వివాదం తలెత్తి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే అక్కడ మట్టి డంపింగ్, తరలింపు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెవెన్యూ రికార్డుల్లో మాత్రం భూమి వ్యవసాయంగానే నమోదై ఉండటంతో రైతుబంధు సాయం అందుతున్నట్లు సమాచారం. దీంతో భూమి రికార్డులు, వాస్తవ వినియోగం మధ్య వ్యత్యాసంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లేఅవుట్తో మొదలైన వివాదం
సర్వే నంబర్ 160లోని 2.10 ఎకరాల్లో గతంలో లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో 50 నుంచి 60 మంది వరకు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అనంతరం భూమి విక్రయదారులు, అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి మధ్య వివాదం ఏర్పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్లాట్ల కొనుగోలుదారుల హక్కులు, భూమిపై యాజమాన్య అంశాలు న్యాయస్థానం పరిధికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసు తేలకముందే భూమిలో కొత్తగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో సదరు 2.10 ఎకరాల భూమి వ్యవసాయ భూమిగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదే ఆధారంగా రైతుబంధు సాయం కూడా అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించినట్లు, ప్రస్తుతం మట్టి డంపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉండటంతో భూమి వాస్తవ వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి స్వభావంలో మార్పులు చోటుచేసుకున్నాయా? రైతుబంధు సాయం పొందేందుకు నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
కోర్టు కేసు ఉండగానే మట్టి డంపింగ్?
న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో మట్టి డంపింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎంత పరిమాణంలో మట్టి తరలించేందుకు అనుమతి ఇచ్చారు? అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది. భూమి హక్కులపై వివాదం పరిష్కారం కాకముందే అక్కడ మట్టి తరలింపు వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు. భూమి రికార్డులు, గతంలో జరిగిన లేఅవుట్, ప్లాట్ల విక్రయాలు, కోర్టు వివాదం, రైతుబంధు సాయం, మట్టి తరలింపు వంటి అంశాలపై అధికారులకు సమాచారం ఉందా? ఉంటే ఇప్పటివరకు క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి కారణంగా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారిక నిర్ధారణ లేదు. సంబంధిత శాఖలు రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెల్లడిస్తేనే ఆరోపణల్లో నిజానిజాలు తేలనున్నాయి.
రికార్డులు.. అనుమతులపై సమగ్ర పరిశీలన అవసరం
సర్వే నంబర్ 160లోని భూమికి సంబంధించిన పాత, ప్రస్తుత రెవెన్యూ రికార్డులతో పాటు లేఅవుట్ అనుమతులు, ప్లాట్ల విక్రయ వివరాలు, కోర్టు కేసు, రైతుబంధు మంజూరు, మట్టి డంపింగ్–తరలింపునకు సంబంధించిన అనుమతులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వేరే విధంగా వినియోగిస్తుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భూమిపై జరుగుతున్న కార్యకలాపాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

