పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలు నెరవేర్చాలి
టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్గౌడ్
కాకతీయ, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన, వాయిదాల ధోరణిని విడనాడి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్టీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ డిమాండ్ చేశారు. వేములవాడ మండలంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన టీఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 6 డీఏలను మంజూరు చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించి దసరాలోపు అమలు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ ప్రయోజనాలను విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం చూపుతున్న GO-25ను సవరించాలని, GO-317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కోల వినయ్కుమార్, తుమ్మల బాబురాజు, పోతుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

