బడిబాటను విస్తృతంగా నిర్వహించాలి!
ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం నమోదు పెంపు లక్ష్యం
మూతపడిన ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం
హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
బడిబాటపై డీఈవో, ఎంఈవోలతో కలెక్టర్ సమీక్ష
కాకతీయ, హనుమకొండ : జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను గణనీయంగా పెంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బడిబాట కార్యక్రమాల పురోగతిపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 16 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కనీసం 10 శాతం పెరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాలు, మండల స్థాయి అధికారులను బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఇంటింటి సర్వేతో సరికొత్త నమోదు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, సురక్షిత వాతావరణం కల్పిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గతంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో మూతపడిన పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని, నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టాలని ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రవాణా భత్యం ప్రతి అర్హ విద్యార్థికి అందేలా చూడాలని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగా భవనాలకు రంగులు వేయడం, పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలకు ఆదేశం
నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల అర్హతలు, అనుమతులు, ఫీజుల నిర్మాణంపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గృహాల లెక్కింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ಈ సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుమా, జీసీఈవో సునీత, జిల్లాలోని 14 మండలాల మండల విద్యాశాఖ అధికారులు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

