గోదావరి ఇసుక దోపిడీని అరికట్టాలి!
డీసీల్టేషన్ పేరుతో అధికార, ప్రతిపక్ష మాఫియాల కొల్లగొట్టుడు
ఏజెన్సీ ఆదాయాన్ని ఇక్కడి అభివృద్ధిరికే కేటాయించాలి
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరిక
కాకతీయ, నూగూరు వెంకటాపురం : సీతారామ ప్రాజెక్టు పేరుతో వెంకటాపురం మండలంలో డీసీల్టేషన్ నెపంతో గోదావరిలోని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను కొల్లగొట్టేందుకు ఇసుక మాఫియా పూనుకుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెజ్జరీ దామోదర్ ఆరోపించారు. ఆలుబాక కేంద్రంలో జరిగిన సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. డీసీల్టేషన్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు వస్తాయని.. వెంటనే ఈ పద్ధతిని రద్దు చేసి, పాత విధానంలో సొసైటీల ద్వారానే ఇసుక ర్యాంపుల నిర్వహణ జరపాలని డిమాండ్ చేశారు.
చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు!
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏజెన్సీ వనరులను బడా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతూ ఆదివాసీల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయని దామోదర్ మండిపడ్డారు. కేంద్రం అడవులను ధారదత్తం చేయడం వల్ల 1/70, పేసా చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఏజెన్సీ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు కాకుండా ఇక్కడి అభివృద్ధి కేటాయించాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా ప్రయత్నాలను ఆపకుంటే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మహాసభ అనంతరం వెంకటాపురం నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా పూనెం చందు, కార్యదర్శిగా కాపుల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఇర్ప శ్రీను, కుంజ నారాయణ, కొర్ష వంశి, సోలం నరసింహాస్వామి, మిడం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

