నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు
ఊకల్ హవేలీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
కాకతీయ,గీసుగొండ : మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ట మాస విదియను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి వేద మంత్రోచ్ఛరణల నడుమ పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

