సింగరేణి ప్రాంతంలో కవిత బాయిబాట
ఈనెల 15 నుంచి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటన
బొగ్గు గనుల వద్ద కార్మికులతో ప్రత్యేక సమావేశాలు
ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించి కార్మికులతో ఆమె మమేకం కానున్నారు. బాయిబాట పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ చీఫ్ కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 6 రోజుల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తారు. ఈనెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో గల బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటన సాగుతుంది.
కార్మికులతో ముఖాముఖి
17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ 2 ఏరియా బొగ్గు గనులను సందర్శిస్తారు. 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ 3 ఏరియాలో పర్యటించి కార్మికుల సమస్యలను తెలుసుకుంటారు. 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో సమావేశమవుతారు. కార్మిక క్షేత్రంలో ఎదురవుతున్న సమస్యలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు.

