చిన్నబోయినపల్లిలో అక్షర చైతన్యం
ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి నో-ఎంట్రీ
కార్పొరేట్ విద్య పేరిట దోపిడీపై గ్రామం ‘మహా సంకల్పం’
రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన ఏజెన్సీ గ్రామం
ప్రభుత్వ విద్య బలోపేతానికి ఒకే తాటిపైకి గ్రామస్థులు
ఒక్కరోజే ప్రభుత్వ బడిలోకి 103 మంది పిల్లలకు అడ్మిషన్లు
ప్రభుత్వ బడి బాట.. తెలంగాణ చరిత్రలోనే అరుదైన ఘట్టం
ఫీజుల భారం నుంచి విముక్తి.. సమానత్వ విద్యకు బాటలు వేసిన గ్రామసభ తీర్మానం
ప్రభుత్వ బడుల మనుగడకు సరికొత్త మార్గదర్శకం
కాకతీయ, ఏటూరునాగారం/ తెలంగాణ బ్యూరో : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల అడ్డగోలు ఫీజుల దోపిడీతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రభుత్వ విద్యను గుండెల్లో పెట్టుకోవచ్చని నిరూపించింది ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ‘చిన్నబోయినపల్లి’ గ్రామం. మారుమూల ఆదివాసీ ప్రాంతంలోని ఈ చిన్న గ్రామం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. నేడు యావత్ తెలంగాణ విద్యా వ్యవస్థకే నిలువెత్తు దిక్సూచిగా మారింది. సామాజిక సమానత్వం కేవలం ఉచిత, నాణ్యమైన ప్రభుత్వ విద్య ద్వారానే సాధ్యమని నమ్మిన ఆ ఊరి ప్రజలు అక్షర చైతన్యంలో సరికొత్త రికార్డు సృష్టించారు. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ యూపీఎస్ (అప్పర్ ప్రైమరీ) పాఠశాలల్లోనే చేర్పించాలని, ఏ ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలల వైపు చూడకూడదని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించి తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు.

ఊరిలోకి ప్రైవేట్ బస్సులు వస్తే ఊరుకోం..!
చిన్నబోయినపల్లి గ్రామస్థుల మహా సంకల్పం కేవలం తీర్మానాలకే పరిమితం కాలేదు. అక్రమంగా ఫీజులు గుంజే ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలు ఏవీ కూడా తమ గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని ఊరి పొలిమేరల్లోనే బోర్డులు పాతారు. ఒకవేళ ఎవరైనా గ్రామసభ నిబంధనలను అతిక్రమించి, దొంగచాటుగా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపితే.. ఆయా కుటుంబాలపై సామాజికంగా, గ్రామసభ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఊరంతా ఒకే మాటపై నిలబడి, ఏకంగా ఒక్కరోజే 103 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల ముంగిట చేర్పించి ‘మహా అడ్మిషన్ల జాతర’ను కళ్లముందు సాక్షాత్కరింపజేశారు. పిల్లల చేతికి వెల్కమ్ కిట్స్ ఇస్తూ అధికారులు, ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో బడికి స్వాగతం పలికారు. నిన్నటివరకు విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడే దుస్థితికి చేరిన ప్రభుత్వ బడి.. నేడు వందలాది మంది పిల్లల కిలకిలరావాలతో కళకళలాడుతోంది. క్షేత్రస్థాయిలో రిపోర్టర్ పరిశీలించినప్పుడు అక్కడ కనిపించిన విద్యా చైతన్యం నిజంగా అభినందనీయం.
మంత్రి సీతక్క అండ.. మౌలిక వసతులపై ఫోకస్!
చిన్నబోయినపల్లి ప్రజలు రగిలించిన ఈ విద్యా చైతన్య జ్వాలకు క్షేత్రస్థాయిలో అద్భుతమైన మద్దతు లభిస్తోంది. స్థానిక యువకుడు దుపటి సతీష్ లాంటి వారు ముందంజ వేసి, రాష్ట్ర మంత్రి సీతక్క సంపూర్ణ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కసరత్తు ప్రారంభించారు. పిల్లల భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మాణం, విజ్ఞానాన్ని పెంచేందుకు ‘ఆశయం గ్రంథాలయం’ ఏర్పాటు చేసేలా అధికారులను సమన్వయం చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ విద్యపై ఇంతటి నమ్మకాన్ని ఉంచిన తరుణంలో.. విద్యాశాఖ కూడా తక్షణమే స్పందించి, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయులను, డిజిటల్ క్లాస్ రూమ్ వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతి ఊరికీ ఈ చైతన్యం ఆదర్శం కావాలి..!
పేరుకే పెద్ద స్కూల్ అంటూ వసతులు లేని కార్పొరేట్ భ్రమల్లో కొట్టుమిట్టాడుతూ, వేలాది రూపాయల ఫీజుల భారంతో అప్పులపాలవుతున్న తల్లిదండ్రులకు చిన్నబోయినపల్లి ఒక పెద్ద కనువిప్పు. ప్రభుత్వ బడులను కాపాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిరూపించిన ఈ గ్రామ చైతన్యం నిజంగా శభాషనదగ్గది. ఇదే తరహా చైతన్యం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వస్తే.. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాకుండా, కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

