జనసేనలోకి గడల
కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
శ్రీనివాసరావు రాక పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను : గడల
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత అనుబంధం ఉందన్నారు ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన అధికారిగా ఆయన ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
కరోనా సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు డాక్టర్ గడల శ్రీనివాసరావు వంటి అనుభవజ్ఞులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని తీసుకువస్తుందని తెలిపారు సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తున్న ఆయన తెలంగాణలో పార్టీ విస్తరణకు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆలోచించి తీసుకున్న నిర్ణయం
అనంతరం డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో తన అనుబంధం మెగాస్టార్ చిరంజీవి ద్వారా ప్రారంభమైందని తెలిపారు. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయం కాదని సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఆలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. యువతకు ఆశయాలను అందించే నాయకత్వం పవన్ కళ్యాణ్లో కనిపించిందని అన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
ఇకపై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తన ప్రభుత్వ సేవా కాలంలో అందించిన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో తనతో కలిసి పనిచేసిన మీడియా మిత్రులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

