ఆపరేషన్ రేపే ఇగ!
ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్లలో జాప్యం
వైద్యులు లేరా? సమయం దొరుకుతలేదా?
రోగులను థియేటర్ వద్దకు తీసుకెళ్లి మళ్లీ వార్డుల్లోకి
నెల రోజులు గడుస్తున్నా ఆపరేషన్ల కోసం పడిగాపులు
ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియని బాధితులు
నర్సులు ఇచ్చే మందులు, ఉచిత భోజనంతో సరి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకెళ్లగలం గానీ.. నీటిని తాగించలేం అన్నచందంగా మారింది ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల పరిస్థితి. ఆర్థోపెడిక్ వార్డుకు చెందిన రోగులు ఆపరేషన్ల కోసం నెల రోజులకు పైగా ఎదురుచూస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగి శస్త్ర చికిత్సల అవసరమైన బాధితులు డాక్టర్ల దయాదాక్షిణ్యాల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. తమ వంతు ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందా? అని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఆదివారంతోపాటు పండుగలకు సెలవులు పాటిస్తుండడంతో రోగులు సోమవారం నుంచి శనివారం వరకు తమ సీరియల్ వచ్చేనా అంటూ దిగులుతో బాధను దిగమింగుకుంటున్నారు.
ఓ స్త్రీ రేపురా!
కొన్నేళ్ల క్రితం ఇంటి ముందు గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ రాసేవారు. అదే పరిస్థితి ఎంజీఎం ఆపరేషన్ థియేటర్ వద్ద కనిపిస్తోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి మోకాలి వద్ద ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అతడు ఆస్పత్రిలో చేరి నెల రోజులకు పైగానే అవుతోంది. రెండు వారాలుగా అతడిని ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఒకసారి టైం అయిపోయిందని, మరో రోజు మత్తు మందు లేదని, ఇలా ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్లిన రోజల్లా ఏదో సాకుతో తిరిగి వార్డుకు తరలిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. ఇలా ఆర్థోపెడిక్ వార్డులో చాలామంది పరిస్థితి ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సులు ఇచ్చే మందులు, ఉచిత భోజనం!
ఆపరేషన్ అవసరం ఉన్నవారికి చేసే వరకు మందులు పెద్దగా ఇవ్వరు. కేవలం నొప్పి నివారణ కోసం రోజు వారీగా రెండు, మూడు గోలీలు ఇస్తుంటారు. ఇదే ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఎంజీఎంలో రోగులకు అందే వైద్యం. మధ్యాహ్నం పూట ఉచితంగా అందే భోజనం మినహా… వారి ఆరోగ్యాన్ని పరిశీలించే వారే ఉండరు. పగటి పూట వార్డులో కనీసం ఒక నర్సు కూడా అందుబాటులో ఉండరు. రోగుల వద్ద ఎవరూ లేని సమయంలో ఏదైనా అవస్థ అనిపిస్తే.. నర్సులను పిలిచేందుకు అవకాశం లేకపోవడంతో బాధను దిగమింగుకుని మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు బాధితులు పేర్కొంటున్నారు.
పైరవీలు చేసిన వారికే ప్రియారిటీ!
ఆపరేషన్లు, ఇతర వైద్య సేవల్లో పైరవీలు చేసిన వారికే వైద్యులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్లిన కొందరు రోగులు పైరవీలు చేసే స్థాయి లేక.. రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక రోజుకు పదిమందికి మించి ఆపరేషన్లు చేయడం లేదని తెలుస్తోంది. ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకే పెద్ద ఆస్పత్రి. రోజుకు పదే ఆపరేషన్లు అంటే.. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర భాగాలు పూర్తిగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుందేమోనని బాధితులు కుమిలిపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎంజీఎంలో ఆదివారం తోపాటు పండుగల రోజున కూడా ఆపరేషన్ థియేటరు సెలవులు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూడా ఆపరేషన్ల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

