అనధికార ఫ్లెక్సీలపై జీడబ్ల్యూఎంసీ కొరడా
నెల రోజుల పాటు నగరవ్యాప్త ప్రత్యేక డ్రైవ్కు శ్రీకారం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. పట్టణ ప్రణాళిక విభాగం, డీఆర్ఎఫ్ బృందాలు ఏసీపీల నేతృత్వంలో నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించారు. నగర సౌందర్యానికి భంగం కలిగించే విధంగా ఎవరూ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నగర సుందరీకరణలో భాగంగా మొదటి విడతలో వారం రోజుల్లో అనధికార ఫ్లెక్సీలను పూర్తిగా తొలగిస్తామని, రెండో విడతలో ప్రభుత్వ భవనాలు, గోడలపై అనుమతి లేని వాల్ రైటింగ్స్, పోస్టర్లు, పెయింటింగ్లను తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్లు రూపొందిస్తామని ఆయన తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జీడబ్ల్యూఎంసీ పరిధిలో నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక డ్రైవ్కు ప్రజలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు సహకరించాలని కమిషనర్ కోరారు. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సంస్థలు మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పార్కులు, విద్యుత్ స్తంభాలు, సెంట్రల్ డివైడర్లు, రహదారి కూడళ్ల వద్ద గోడపత్రికలు, స్టిక్కర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడిందని కమిషనర్ తెలిపారు. సుందరమైన గ్రేటర్ వరంగల్ నిర్మాణమే జీడబ్ల్యూఎంసీ లక్ష్యమని, నగర సౌందర్యాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

