ఆగస్టు 15లోగా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే కీలకం
పార్టీ పదవుల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరి
సామాజిక సమతుల్యతతో కమిటీలను రూపొందించాలి
ఏఐసీసీ ప్రమాణాలు పాటించని కమిటీలకు ఆమోదం ఉండదు
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, హన్మకొండ : “కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం క్షేత్రస్థాయి కార్యకర్తలే. బూత్, విలేజ్, మండల కమిటీల ఏర్పాటే పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తుంది. అధిష్ఠానం నిర్దేశించిన గడువులోగా కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలి” అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బూత్, విలేజ్, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మండల అధ్యక్షులు, ఇంచార్జ్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి పల్లె శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట ఇంచార్జి కూచన రవళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హుస్నాబాద్, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల అధ్యక్షులు, డీసీసీ ఇంచార్జ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆగస్టు 15లోగా ప్రక్రియ పూర్తి చేయాలి
ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిష్ఠానం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉన్నందున పూర్తి బాధ్యతతో పనిచేసి ఆగస్టు 15లోగా అన్ని బూత్, విలేజ్, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండల కమిటీలో సభ్యుల సంఖ్య 21 మందికి మించకూడదని, డీసీసీ అధ్యక్షుడి కోటా కింద ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యక్షుడి నియామకానికి సంబంధించిన అంశాల్లో మండల అధ్యక్షులు తనతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కమిటీల నియామకంలో సామాజిక న్యాయాన్ని తప్పనిసరిగా పాటించాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కమిటీలో కనీసం 30 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత భాగస్వామ్యం ఉండేలా కమిటీలను రూపొందించాలని సూచించారు. మహిళలకు ప్రాతినిధ్యం లేని కమిటీలను అధిష్ఠానం ఆమోదించదని చెప్పారు. కమిటీల ఏర్పాటు పూర్తయిన వెంటనే ఆగస్టు 15 నుంచి 31 మధ్య తొలి మండల కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. నియామక ప్రక్రియలో మండల అధ్యక్షులు, ఇంచార్జ్లు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావులేకుండా కష్టపడే నాయకులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఏఐసీసీ నిర్దేశించిన ప్రమాణాలు పాటించని కమిటీలకు డీసీసీ అధ్యక్షుడిగా తాను ఆమోదం తెలపబోనని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు, ఇంచార్జ్ కమిటీ సభ్యులు కమిటీల ఏర్పాటు పురోగతిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

