నకిలీ ఇంటి నంబర్తో మోసం
పంచాయతీ వెబ్సైట్లో ఫోర్జరీ రికార్డు
రిజిస్ట్రేషన్కు ఉపయోగించేందుకు యత్నం.. ఐదుగురు అరెస్టు
కాకతీయ, ఆత్మకూర్ : ఇంటి స్థలానికి అక్రమంగా నకిలీ ఇంటి నంబర్ సృష్టించి, దానిని రిజిస్ట్రేషన్కు ఉపయోగించేందుకు ప్రయత్నించిన కేసులో ఐదుగురిని ఆత్మకూర్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 152/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 336(3) రెడ్విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి నాగెల్లి అలియాస్ మరపల్లి సంపూర్ణ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బలభద్ర రాంబాబుకు 2019లో కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన ఆస్తి పంపకాల్లో 140 చదరపు గజాల ఇంటి స్థలం వచ్చింది. ఆ స్థలాన్ని విక్రయించేందుకు యాక రాజుతో రూ.9.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు.
సబ్ నంబర్గా 4-168/1 సృష్టింపు
స్థలానికి ఇంటి నంబర్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుందని భావించిన రాంబాబు, ఆత్మకూర్ ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బారుపట్ల సురేష్ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. త్వరగా ఇంటి నంబర్ సృష్టించి ఇస్తానని చెప్పడంతో సురేష్కు రూ.10 వేల నగదు ఇచ్చినట్లు వెల్లడైంది. రాంబాబు సోదరుడి ఇంటి నంబర్ 4-168కు సబ్ నంబర్గా 4-168/1ను సృష్టించేలా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. సురేష్ రాంబాబు వివరాలను గెదిపే రమేష్కు పంపి రూ.8 వేల వరకు ఇచ్చినట్లు తెలిపారు. రమేష్ అందులో రూ.4,500ను ఫోన్పే ద్వారా సుందరి ఉదయ్కుమార్కు పంపాడు. అనంతరం ఉదయ్కుమార్ పంచాయతీరాజ్ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ మొహమ్మద్ అజీజ్కు వివరాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. అజీజ్ తెలంగాణ ఈ-పంచాయతీ వెబ్సైట్లో పెద్దాపూర్ గ్రామ వివరాలను ఉపయోగించి ఇంటి నంబర్ 4-168/1, అసెస్మెంట్ నంబర్ 944 పేరుతో నకిలీ రికార్డు సృష్టించినట్లు గుర్తించారు. అందులో బలభద్ర రాంబాబు పేరుతో 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు రూ.525 ఇంటి పన్ను విధించినట్లు నమోదు చేశారు. తయారు చేసిన నకిలీ పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
నకిలీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్కు ఉపయోగించేందుకు రాంబాబు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శికి సమాచారం లేకుండా ఇంటి నంబర్ కేటాయించడంతో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ కేసులో ఎ1 బలభద్ర రాంబాబు, ఎ2 బారుపట్ల సురేష్, ఎ3 గెదిపే రమేష్, ఎ4 సుందరి ఉదయ్కుమార్, ఎ5 మొహమ్మద్ అజీజ్ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఇంటి నంబర్ సృష్టించడం, తప్పుడు పన్ను వివరాలు నమోదు చేయడం, డిజిటల్ మార్గాల్లో పత్రాలను పంపించడం, నగదు, ఫోన్పే ద్వారా డబ్బులు బదిలీ చేయడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి రిజిస్ట్రేషన్కు ఉపయోగించే ప్రయత్నాలను సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

