ఎస్ఐఆర్పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించాలి
ఆగస్టు 10లోగా ఫారమ్-6 ప్రక్రియ పూర్తి చేయాలి
ముసాయిదా జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
నకిలీ ఓట్ల గుర్తింపుపై అప్రమత్తంగా ఉండాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ రెండో విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు జరిగేలా పార్టీ శ్రేణులు వేగంగా చర్యలు చేపట్టాలని అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ రెండో విడత రాష్ట్రస్థాయి వర్క్షాప్లో ఎన్. రాంచందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉన్నందున ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వారితో ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ముసాయిదా జాబితాపై నిఘా
గడువు ముగిసిన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అభ్యంతరాల దాఖలు వంటి కీలక ప్రక్రియలు ఉంటాయని రాంచందర్రావు తెలిపారు. ఫారమ్-7 ద్వారా ఓట్ల తొలగింపు, ఫారమ్-8 ద్వారా సవరణలను నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు తగిన ఆధారాలతో న్యాయపరంగా సమాధానాలు ఇవ్వాలని బీఎల్ఏ-1లు, న్యాయ బృందాలకు సూచించారు. పోలింగ్ బూత్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకమని, ఆ బాధ్యతను బీజేపీ ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్. రాంచందర్రావు కోరారు.

