మిరప నారు కొంటే.. కన్నీళ్లే..!
నాణ్యత లేని నారుతో రైతుల ఆశలు ఆవిరి
మొక్క ఎదుగుదల.. కాయధారణలో తేడాలతో దిగుబడులు పతనం
అనుమతులు, విత్తనాల బ్యాచ్ వివరాలపై అనుమానాలు
ఉద్యానవన శాఖ అండదండలున్నాయన్న ఆరోపణలు
కోట్ల ‘జీరో’ వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండి
కాకతీయ, ములుగు ప్రతినిధి : మిరప సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నారు నష్టాలే మిగులుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని రామన్నగూడెం, ముల్లెకట్టు, శంకరాజుపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటు మిరప నారు నర్సరీలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక దిగుబడులు వచ్చే రకాలంటూ నారు విక్రయిస్తున్నారని, పొలాల్లో నాటిన తర్వాత మొక్కల ఎదుగుదల, కాయధారణ ఆశించిన స్థాయిలో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరకు అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు గత సీజన్లో అనేకమంది ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు నర్సరీల నిర్వహణకు అవసరమైన అనుమతులు, విత్తనాల నాణ్యత, విక్రయ రికార్డులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యానవన శాఖ అధికారుల అండదండలతోనే వ్యవహారం సాగుతోందన్న ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. నర్సరీల వెనుక తెరవెనుక ఓ ‘షాడో ఆఫీసర్’ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. నారు, విత్తనాల విక్రయాల రూపంలో భారీ లావాదేవీలు జరుగుతున్నా బిల్లులు, పన్నుల చెల్లింపులపై అనుమానాలు ఉండటంతో కోట్ల రూపాయల ‘జీరో’ వ్యాపారం సాగుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నారు నాణ్యతపై అనుమానాలు
ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల రైతులు ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మిరప నారు నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నాటిన తర్వాత మొక్కల ఎదుగుదలలో తేడాలు కనిపిస్తున్నాయని, కాయలు చిన్న సైజులో రావడం, కాయధారణ తగ్గిపోవడం, దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అధిక దిగుబడి వస్తుందని నమ్మి నారు కొనుగోలు చేసి సాగు చేస్తే చివరకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీల్లో ఉపయోగిస్తున్న విత్తనాలు ఏ కంపెనీకి చెందినవి? వాటి బ్యాచ్ వివరాలేమిటి? విత్తనాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, రికార్డులు ఉన్నాయా? తయారు చేస్తున్న నారు నాణ్యతను ఎలా నిర్ధారిస్తున్నారు? అన్న ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. నర్సరీ నిర్వాహకులు చూపించే రికార్డులకు, వాస్తవంగా నర్సరీల్లో ఉన్న మొక్కలకు సంబంధం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విత్తనాల మూలం నుంచి నారు విక్రయం వరకు పూర్తి రికార్డులను అధికారులు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
అధికారుల అండదండలున్నాయా?
నర్సరీల నిర్వహణ, అనుమతులు, నారు నాణ్యత, విక్రయ రికార్డులపై సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో నర్సరీలు చాలాకాలంగా కొనసాగుతున్నా అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా ఇలాంటి వ్యవహారం ఇంతకాలం సాగడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. నర్సరీల నిర్వహణకు తెరవెనుక ఉద్యానవన శాఖకు చెందిన ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నర్సరీల అనుమతులు, నిర్వహణ, ఉన్నతాధికారులతో వ్యవహారాల విషయంలో ఆ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ను ‘షాడో ఆఫీసర్’గా పేర్కొంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? సదరు అధికారికి నర్సరీ నిర్వాహకులతో ఉన్న సంబంధాలేమిటి? నర్సరీల అనుమతుల విషయంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
కోట్ల ‘జీరో’ వ్యాపారమా?
మిరప నారు, విత్తనాల విక్రయాల ద్వారా ప్రైవేటు నర్సరీల్లో భారీగా లావాదేవీలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. అయితే విక్రయాలకు సంబంధించి బిల్లులు జారీ చేస్తున్నారా? రికార్డులు నిర్వహిస్తున్నారా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా ఎంత మొత్తంలో నారు విక్రయిస్తున్నారు? ఎంత మేరకు బిల్లులు ఇస్తున్నారు? ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తున్నారు? అన్న వివరాలను వాణిజ్య పన్నులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా తనిఖీ చేయాలని రైతులు కోరుతున్నారు. లెక్కల్లోకి రాని ‘జీరో’ వ్యాపారం ఏమైనా సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు, విత్తనాల మూలం, బ్యాచ్ వివరాలు, నారు నాణ్యత, విక్రయ బిల్లులు, పన్నుల చెల్లింపులపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల పెట్టుబడులతో ముడిపడిన మిరప నారు వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

