విద్యుత్ కష్టాలకు తావుండొద్దు
గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
మైలారంలో రూ.9 లక్షలతో ప్రత్యేక విద్యుత్ లైన్ ప్రారంభం
రైతులు, ప్రజలకు మెరుగైన సరఫరా అందించాలి
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ప్రజలకు విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గృహ వినియోగం, గ్రామీణ అవసరాల కోసం రూ.9 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక విద్యుత్ లైన్ను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు తలెత్తకుండా ప్రత్యేక విద్యుత్ లైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మైలారం గ్రామానికి ప్రత్యేక విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలతో పాటు రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని యశస్విని రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు కావడంతో విద్యుత్ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉల్లెంగల నర్సయ్య ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, హామ్యా నాయక్, సర్పంచ్ చిర్ర వేణు, చెవ్వు కాశీనాథం, బొమ్మెర కళ్యాణ్, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

