ఆస్పత్రుల్లో వైద్యం అంతంతే
హన్మకొండలో గాడి తప్పిన వైద్య సేవలు
హసన్పర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మృగ్యమైన సేవలు
కమలాపూర్, ధర్మసాగర్లో అప్పుడప్పుడే వైద్యులు
పీహెచ్సీల్లో పరిస్థితి మరీ దారుణం
వేధిస్తున్న వైద్యుల కొరత.. ఉన్నవారి హాజరు కూడా నామమాత్రమే
హాజరు కోసం వచ్చి వెళ్తున్నారనే విమర్శలు
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మృగ్యమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల కొరత ఓవైపు.. ఉన్న వైద్యులు కూడా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం మరోవైపు సమస్యగా మారింది. హాజరు కోసం ఆస్పత్రికి వచ్చి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హసన్పర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన స్థాయిలో లేకపోవడం, రోగులకు అవసరమైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవల పలు మీడియాల్లో కథనాలు వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్తలు వచ్చినప్పుడే అధికారులు స్పందించి ఆ తర్వాత మళ్లీ పట్టించుకోకపోవడంతో సమస్య యథాతథంగా కొనసాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వంద పడకల ఆస్పత్రిలో వైద్యం ఏదీ?
హసన్పర్తి ప్రభుత్వ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవడం, కొన్ని విభాగాల్లో సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇటీవల ఈ ఆస్పత్రి పనితీరుపై పలు కథనాలు వచ్చినా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న సేవలు, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలన జరిపితే అసలు పరిస్థితి బయటపడుతుందని స్థానికులు అంటున్నారు.
కమలాపూర్, ధర్మసాగర్లో ఇదే తీరు
కమలాపూర్, ధర్మసాగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యుల రాక క్రమం తప్పుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్యులు ప్రతిరోజూ అందుబాటులో ఉండాల్సి ఉన్నా అప్పుడప్పుడే దర్శనమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు కూడా సరైన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు. వైద్యుల కొరత కారణంగా ఉన్న వైద్యులపై అదనపు భారం పడుతుండగా, అందుబాటులో ఉన్న సిబ్బంది పనితీరును కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పీహెచ్సీల్లో మరింత దారుణం
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల కొరత కారణంగా పలు పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని తెలుస్తోంది. ఉన్న వైద్యులు కూడా నిర్ణీత సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అన్న దానిపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు ఉన్నాయి. వైద్యుల కోసం పీహెచ్సీలకు వచ్చే రోగులకు నిరీక్షణ తప్పడం లేదని, కొన్నిసార్లు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలే ప్రధాన ఆధారం కావడంతో ఈ పరిస్థితి పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
హాజరు కోసం వచ్చి వెళ్తున్నారా?
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాజరు నమోదు చేసుకునేందుకు ఆస్పత్రికి వచ్చి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. విధుల సమయమంతా ఆస్పత్రిలో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బయోమెట్రిక్ హాజరు వివరాలు, విధుల పట్టికలు, సెలవుల వివరాలు పరిశీలించడంతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వస్తుందని ప్రజలు కోరుతున్నారు. వైద్యుల కొరతపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది పనితీరుపైనా కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు సక్రమంగా హాజరవుతున్నారా, రోగులకు నిర్ణీత సమయాల్లో సేవలు అందుతున్నాయా, పీహెచ్సీల్లో పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే నెలల తరబడి సమస్యలు కొనసాగుతున్నా క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధులకు డుమ్మా కొట్టే వైద్యులతో ఎవరి మిలాఖత్ ఉందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన అధికారులు ఉన్నప్పటికీ కింది స్థాయిలో ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటే పర్యవేక్షణ వ్యవస్థ ఎంతమేర పనిచేస్తుందో స్పష్టమవుతోంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్యుల హాజరును పర్యవేక్షిస్తేనే ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగే అవకాశం ఉంది.

