కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తిప్పికొడతాం
పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలంలో నిరసన
కాకతీయ, నల్లబెల్లి : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు నిరసన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బానోతు సారంగపాణి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలు కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలులో జాప్యం చేస్తోందని విమర్శించారు. లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కులు నగదుగా మారడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.
అర్హులకు సకాలంలో సాయం అందించాలి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించాలని సారంగపాణి డిమాండ్ చేశారు. పథకాల అమలులో జాప్యాన్ని నివారించి పేద కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, చెట్టుపల్లి మురళీధర్, ఉడుగుల ప్రవీణ్కుమార్ గౌడ్, గందె శ్రీనివాస్ గుప్తా, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

