ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
మండల పరిషత్ కార్యాలయంలో 8 అర్జీల స్వీకరణ
వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు హాజరు
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
కాకతీయ, గీసుగొండ : ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారికి వేగవంతమైన సేవలు అందించడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని ఎంపీడీఓ వి. కృష్ణవేణి, తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ తెలిపారు. సోమవారం గీసుగొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 8 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ కృష్ణవేణి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో తొలి వారంలో తొలి దరఖాస్తును మరియపురం గ్రామానికి చెందిన రంపీస మదన్ మోహన్ అందించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ నూతన్ ప్రసాద్, వెటర్నరీ డాక్టర్ జి. శ్రీనివాస్, ఏఈ రాజు, సందీప్, మండల విద్యాశాఖ అధికారి రవీందర్, సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈ-పంచాయతీ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

