నోటీసును ఉపసంహరించుకోవాలి
సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు
కుటుంబ బంధం కారణంగా రాజకీయ బాధ్యత ఎలా?
కాంగ్రెస్ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ వివరణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తన జన్మదిన వేడుకల్లో కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, కుటుంబ బంధం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి గురువారం ఆమె లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తన ప్రమేయం లేని అంశంలో తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు నిర్వహించారని సురేఖ తెలిపారు. సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారని పేర్కొన్నారు. గీసుకొండలో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేశారు.
రాజకీయ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు
కుటుంబ బంధం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందనడం సమంజసం కాదని సురేఖ పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని కొండా సురేఖ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని గుర్తించాలని కోరారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

