వై-జంక్షన్లో వ్యక్తి మృతదేహం
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై-జంక్షన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇంటి యజమాని లోటపేటల పాపయ్య సమాచారం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని వాజేడు మండలం చీకుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన మోడెం శేషయ్య (50)గా గుర్తించారు. ఆయన కోయ (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన కూలీ అని ఏటూరునాగారం ఎస్సై మహేష్ తెలిపారు. శేషయ్య నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఏటూరునాగారంలో దినసరి కూలీగా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

