ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
సహజ వనరులతో స్థిరమైన సాగు సాధ్యం
జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర
125 మంది రైతులకు శిక్షణ, వ్యవసాయ కిట్ల పంపిణీ
కాకతీయ, వరంగల్ బ్యూరో: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద మడిపల్లి రైతు వేదికలో జయగిరి, లక్నవరం, మడిపల్లి గ్రామాలకు చెందిన 125 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ చంద్ర మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరులతో స్థిరమైన వ్యవసాయం చేయవచ్చన్నారు. ఏడీఏ ఆదిరెడ్డి మాట్లాడుతూ పశువుల ఎరువు, పంట అవశేషాలు, వేపతో సాగు ఖర్చులు తగ్గుతాయన్నారు. రిసోర్స్ పర్సన్ హుస్సేన్ నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, పంచగవ్య, వావిలాకు కషాయం, అగ్నాస్త్రం, వేస్ట్ డీకంపోజర్, దశపర్ణి కషాయం తయారీ విధానాలను ప్రదర్శించారు. అనంతరం 125 మంది రైతులకు వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఈఓ సుమన్, సర్పంచ్ రంజిత్, సీఆర్పీలు రమ్య, రవళి, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

