ఈ డాక్టర్లు మారరా..?!
రాయపర్తి పీహెచ్సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు
ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు పెడచెవిన పెడుతున్న వైద్యులు
ఓపి వేళలోనూ జాడ లేని వైద్యులు..రోగుల ఎదురుచూపులు..
ఈసారైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా?
లేక మళ్లీ గాలికి వదిలేస్తారా?
కాకతీయ, రాయపర్తి : ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసినా రాయపర్తి పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు కనిపించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల ఆసుపత్రి సాయంత్రం 4 గంటలకే తాళాలు వేస్తున్నదనే అంశంపై గతంలో కథనం ప్రచురితమవడంతో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీఎంహెచ్వో రాజిరెడ్డి ఆసుపత్రిని తనిఖీ చేశారు. దీంతో పరిస్థితి మారుతుందని ప్రజలు భావించినా.. కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఓపీ సేవలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు 10, 11 గంటలు దాటినా ఆసుపత్రికి రావడం లేదని రోగులు వాపోతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి వైద్యుల కోసం ఎదురుచూస్తున్నారని, చివరకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేసినా.. చర్యలేవీ?
ఎమ్మెల్యే, కలెక్టర్, డీఎంహెచ్వో హాజరు పట్టికలను పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో మార్పు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు కేవలం ఫొటోలు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రజలు అంటున్నారు. విధులకు గైర్హాజరవుతున్న వారిపై చర్యలు లేకపోవడంతోనే నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొంటున్నారు.
బాధితుడు మహమ్మద్ రెహమాన్
శనివారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన తనకు 10:45 గంటలైనా డాక్టర్ అందుబాటులోకి రాలేదని మహమ్మద్ రెహమాన్ తెలిపారు. అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు లేక గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వో స్పందించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


