గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక
375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు
ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
ఆత్మకూర్ ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి
కాకతీయ, ఆత్మకూర్ : గ్రామంలోని వాస్తవ అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడమే వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ లక్ష్యమని ఆత్మకూర్ ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పెద్దాపూర్ గ్రామపంచాయతీలో వీబీజీ–రామ్జీ ప్లాన్ తయారీ విధానంపై శనివారం రైతువేదికలో గ్రామసభ నిర్వహించి డెమో చేపట్టారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్లను రూపొందించారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్, వ్యవసాయ వనరులు, ప్రభుత్వ భవనాలు తదితర మౌలిక వసతులను గుర్తించి లోటుపాట్లపై చర్చించారు. 375 రకాల పనుల్లో గ్రామ అవసరాలు, ప్రయోజనం, సమస్య తీవ్రత ఆధారంగా అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ఎలకటి రవి మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ ఉపయోగపడుతుందన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వ్యవసాయం, వీధిదీపాల అవసరాలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో రాజిరెడ్డి, ఈసీ రాము, జిల్లా ఫిషరీస్ అధికారి చలపతి, హార్టికల్చర్ అధికారి సునీల్, వ్యవసాయ అధికారి యాదగిరి, వెటర్నరీ డాక్టర్ వింధ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు సుధాకర్, శ్రీధర్, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

