మొక్కజొన్న రైతులకు అమ్మకం కష్టాలు
మండలంలో ఒకే ఒక్క కొనుగోలు కేంద్రం
26 క్వింటాళ్ల కొనుగోలు షరతుతో రైతుల్లో పరేషాన్
మిగిలిన పంటను దళారులకు అమ్ముకోవాలా అంటూ ప్రశ్నలు
కొనుగోలు కేంద్రాలను పెంచాలని కలెక్టరుకు వినతి
ఆందోళన చెందుతున్న గీసుగొండ మండల రైతులు
కాకతీయ, గీసుగొండ : యాసంగి సీజన్లో మొక్కజొన్న పంటను భారీగా పండించిన రైతులు ప్రస్తుతం కొనుగోళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మండలానికి కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం, అదీ సరిపడా సౌకర్యాలు లేకపోవడం రైతుల్లో ఆందోళనకు దారి తీస్తోంది. సరైన ప్రణాళిక లేకుండా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఊకల సొసైటీలో సోమవారం పరకాల ఎమ్మెల్యే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ ఒక్క కేంద్రంలోనే తమ మొక్కజొన్నలను అమ్ముకోవాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు,ఆటోలలో పంటను తీసుకువచ్చే రైతులకు రవాణా ఖర్చులు అధికంగా అవుతున్నాయి. కొంతమంది రైతులు ఒకటి కంటే ఎక్కువ సార్లు రాకపోకలు చేయాల్సి రావడం వల్ల అదనపు భారంగా మారింది. ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాళ్లకే కొనుగోలు పరిమితి విధించడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. మంచి దిగుబడి వచ్చిన రైతులు మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, మార్కెట్లో మాత్రం వ్యాపారులు రూ.1900కే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుండగా, కొంతమంది దళారులు ఇంకా తక్కువగా రూ.1800కే రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు.

దళారుల దందా
దళారుల దందా పెరిగి రైతులు నష్టపోతున్నారు.కొనుగోలు కేంద్రాల్లో పరిమితులు, ఆలస్యం కారణంగా రైతులు ప్రైవేట్ దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న దళారులు రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. తాగునీరు, విశ్రాంతి స్థలం వంటి సదుపాయాలు లేక రైతులు చెట్ల నీడనే ఆశ్రయంగా తీసుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అందించాల్సిన భారదాన్ సంచులు అందక పోవడంతో రైతులే సొంతంగా బస్తాలు కొనుగోలు చేసి ధాన్యాన్ని నింపుకొని తీసుకువస్తున్నారు. బస్తాలు కేంద్రంలో దిగుమతి అయి కాంటాలు పూర్తయ్యాక తిరిగి లారీల్లో ఎగుమతి అయ్యేంతవరకు పూర్తి బాధ్యత రైతులపైనే పడుతోంది. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడానికి ఎలాంటి గోదాములు కేటాయించక పోవడంతో రైతులు బస్తాలను ఆరుబయటే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. అనివార్య కారణాలతో వర్షం కురిస్తే మొక్కజొన్న బస్తాలు తడిసే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షరతులు ఫుల్లు.. కొనుగోలు నిల్లు…
ప్రభుత్వం విధించిన వివిధ షరతులు, ప్రమాణాల కారణంగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా భారదాన్ సంచులు ఇంకా సరఫరా కాకపోవడంతో రైతులు సొంతంగా బార్దాన కొనుగోలు చేసి, బస్తాలు నింపుకొని కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడంతో రైతులు రోజులు గడిపే పరిస్థితి ఏర్పడుతోంది.కొన్ని సందర్భాల్లో తేమ శాతం, నాణ్యత పేరుతో పంటను ఆలస్యం చేయడం లేదా తిరస్కరించడం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు ప్రక్రియ మరింత మందగించి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కలెక్టర్ సత్య శారదకు వినతి
ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొనే విషయం తెలుసుకున్న గీసుగొండ రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ సమస్యలను వివరించారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని, పరిమితులను సడలించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని,ఎకరానికి విధించిన పరిమితిని ఎత్తివేయాలని, ప్రకటించిన మద్దతు ధరకు పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతులు మరింత ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

