మక్క రైతుకు తప్పని ‘గోస’
దిగుమతి లేక గోదాంల వద్ద అరిగోస!
రోజుల తరబడి వాహనాల క్యూలు..
తిండి తిప్పలు లేక రైతుల పడిగాపులు!
హమాలీల కొరతతో నిలిచిన దిగుమతి ప్రక్రియ
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం!
ఆరుగాలం శ్రమించినా అమ్ముకోవడానికి తప్పని పోరాటం!
గుండ్లపహాడ్ గోదాం వద్ద వారం రోజులుగా నిలిచిన వందలాది వాహనాలు!
నత్తనడకన సాగుతున్న అన్-లోడింగ్..
రైతుల ఆవేదనను పట్టించుకోని గోదాం ఇన్చార్జి!
తక్షణ చర్యలు తీసుకోకపోతే ధర్నా తప్పదు
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి హెచ్చరిక!
కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇప్పుడు ‘అడవి కాసిన వెన్నెల’లా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వస్తే.. అక్కడ రైతన్నకు చుక్కెదురవుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు ధాన్యం చేరుతున్నప్పటికీ, అక్కడ దిగుమతి ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో రైతులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. గుండ్లపహాడ్ గోదాం వద్ద వారం రోజులుగా వాహనాలు బారులు తీరి ఉండటంతో, అటు రైతులు.. ఇటు డ్రైవర్లు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్న దుస్థితి నెలకొంది. నల్లబెల్లి కొనుగోలు కేంద్రంలో సేకరించిన మొక్కజొన్న బస్తాలను గుండ్లపహాడ్ గోదాముకు తరలిస్తున్నా, దిగుమతి విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వందల సంఖ్యలో వాహనాలు గోదాం ముందు వేచి ఉన్నా, తక్కువ సంఖ్యలో హమాలీలతో పని చేయించడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా తిండి, నిద్ర లేక అక్కడే ఉంటున్నామని, అయినా గోదాం ఇన్చార్జికి తమ బాధలు పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే రైతుల ఈ అరిగోసకు కారణమని స్పష్టమవుతోంది.
పెరగనున్న నిరసన జ్వాలలు!
రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి ఘాటుగా స్పందించారు. రైతులు ఇప్పటికే 20 రోజులుగా పంట అమ్ముకోవడానికి నిరీక్షిస్తున్నారని, గోదాం వద్దకు వచ్చాక కూడా వారం రోజులుగా వాహనాలు ఖాళీ కాకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. వాహనాలు రోజుల తరబడి నిలిచిపోవడంతో పెరుగుతున్న వెయిటింగ్ ఛార్జీల భారాన్ని రైతులు మోయలేరని, ఆ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే హమాలీల సంఖ్యను పెంచి దిగుమతిని వేగవంతం చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి గుండ్లపహాడ్ గోదాం వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.
సర్కారు స్పందిస్తుందా..? మిన్నకుండిపోతుందా?
పంటను పండించడమే ఒక ఎత్తు అయితే, దానిని అమ్ముకోవడానికి కూడా పోరాటాలు చేయాల్సి రావడం తెలంగాణ రైతులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన దిగుమతి ప్రక్రియను పూర్తి చేసి, తమను ఇళ్లకు పంపాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి రైతుల పక్షాన నిలబడతారో లేదో వేచి చూడాలి.

