టీజేఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి
ఉద్యమ లక్ష్యాల సాధనే ధ్యేయం
టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్
జలవిహార్లో 12న పార్టీ వార్షికోత్సవ సభ
కాకతీయ, నర్సంపేట టౌన్: తెలంగాణ అమరుల బలిదానాలు, ప్రజల పోరాట ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో.. ఉద్యమ ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ పేర్కొన్నారు. మే 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న పార్టీ నాలుగో ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేటలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్తో కలిసి ప్లీనరీ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
నియంతృత్వ పాలనపై పోరాటం..
ఈ సందర్భంగా అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పాలకులు ప్రజా సమస్యలను విస్మరించి నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ, ఉద్యమ ఆశయాల సాధనలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్య, బీసీ రిజర్వేషన్ల పెంపు, విద్యా, వైద్య రంగాల అభివృద్ధి మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై టీజేఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
జయశంకర్ స్ఫూర్తితో ముందుకు..
ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ప్రజలను సంఘటితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డబ్బు ఆధారిత రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్లీనరీలో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బోనగాని రవీందర్, గుంటి రామచందర్, సుల్తి సాయికుమార్, మహబూబ్ అలీ, మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.

